కేసీఆర్‌కు మ‌రో ఓట‌మి... దెబ్బ మీద దెబ్బ కొడుతోన్న రేవంత్‌...!

RAMAKRISHNA S.S.
ఆరు నెలల్లోనే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్‌కు రెండు దిమ్మతిరిగే షాక్‌లు తగిలాయి. 6 నెలల్లో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు ఎలా అవుతాయో కేసీఆర్ స్వయంగా చూశారు. గత డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికలలో వరుసగా మూడోసారి గెలిచి తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని ఆశపడ్డ కేసీఆర్ ఆశలకు.. తెలంగాణ ప్రజలు గండి కొట్టారు. ఇక మే నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఒక్క లోక్‌స‌భ సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఇది నిజంగా కేసీఆర్ కు పెద్ద షాకే. ఓవైపు పార్టీలో వారసత్వ పోరు ఉండనే ఉంది.


అటు ముద్దుల కుమార్తె కవిత ఢిల్లీ జైలులో ఉన్నా దిక్కు, దివాణం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితులలో కేసీఆర్ మరో అగ్నిపరీక్షకు సిద్ధమవుతున్నారు. కొద్ది రోజుల్లోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే రైతు రుణమాఫీని పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. రైతు రుణమాఫీకి రేవంత్ గ‌డువు కూడా పెట్టారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే రైతు రుణమాఫీకి మరో నెల రోజులు మాత్రమే గడువు ఉంది. ఆ పని పూర్తయిన ఏ క్షణమైనా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం కానుంది.


ఇప్పటికే ఉచిత బస్సు పథకంతో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకర్షించింది. ఇప్పుడు రైతు రుణమాఫీ ద్వారా గ్రామీణ, తెలంగాణ ప్రజానీకాన్ని కూడా ఆకట్టుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ కు మరోసారి ఘోర పరాభవం తప్పదని చెప్పాలి. ఎందుకంటే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గ్రామీణ తెలంగాణ ప్రజానీకం మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ఓట్లు వేసి గెలిపించింది. కేసీఆర్ అనుసరించిన విధానాలు, దళిత బంధు వంటి కీలకమైన పథకాలు విషయంలో ప్రజలు బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేక భావం వ్యక్తం చేశారు. కేవలం గ్రామీణ ఓటరు దూరంగా ఉండటం వల్లే.. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా కూడా మరోసారి బీఆర్ఎస్‌కు చావు దెబ్బ తప్పదని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: