బాబు కేబినెట్లో ఉమ్మ‌డి అనంత మంత్రులు వీళ్లే... ' కందికుంట ' కు ఛాన్స్‌..?

RAMAKRISHNA S.S.
చంద్రబాబు క్యాబినెట్లో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మంత్రులుగా ఎవరెవరికి అవకాశం ఉంటుంది అన్నదానిపై అప్పుడే రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి ఈసారి 14 సీట్లతో పాటు రెండు పార్లమెంటు స్థానాలు స్వీప్‌ చేసింది. ఈ క్రమంలోనే ఉమ్మ‌డి జిల్లాకు మూడు కేబినెట్ బెర్త్‌లు కచ్చితంగా వస్తాయన్న అంచనాలు అయితే ఉన్నాయి. ఒక ఓసీతో పాటు రెండు బీసీ బెర్త్‌లు ఈ సారి జిల్లాకు ద‌క్కుతాయ‌న్న చ‌ర్చ‌లు పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే ఓసీ వ‌ర్గాల నుంచి ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్‌కు ఈ సారి మంత్రి ప‌ద‌వి గ్యారెంటీ అంటున్నారు. ప‌య్యావుల బుగ్గ కారు కోరిక ఎట్ట‌కేల‌కు నెర‌వేర‌నుంది. ఈ విష‌యంలో ఎలాంటి సందేహాలు అక్క‌ర్లేదు. పైగా గ‌త ఐదేళ్ల‌లో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేగా ఆయ‌న చేసిన పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడ‌ర్‌కు ఎక్క‌డా లేని ఉత్తేజాన్ని ఇచ్చాయి. జిల్లాలో ఐదుగురు క‌మ్మ ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ కోటాలో రాఫ్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీత ఉన్నా కూడా ఆమె గ‌త ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో ఈ సారి సునీత ప్లేసులో కేశ‌వ్‌కే గ్యారెంటీగా బెర్త్ రానుంది.

ఇక రాయ‌దుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కూడా బెర్త్ గ్యారెంటీ అంటున్నారు. బీసీ - బోయ కోటాలో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి రానుంది. కాలువ‌కు గ‌త ప్ర‌భుత్వంలో కూడా మంత్రి ప‌ద‌వి వ‌చ్చింది. ఇక ఈ సారి జిల్లాలో రెండో బీసీ మంత్రి ప‌ద‌విని క‌దిరి ఎమ్మెల్యే కందికుంట వెంక‌ట ప్ర‌సాద్‌కు అవ‌కాశం గ్యారెంటీగా ఉంద‌ని తెలుస్తోది. రాష్ట్రం మొత్తం మీద ప‌ద్మ‌శాలీ, చేనేత ఉప కులాల నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కందికుంట‌. పైగా సీనియ‌ర్ నేత‌. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా సీమ జిల్లాల‌ల‌కు చెందిన బీసీ ఎమ్మెల్యే కావ‌డంతో కందికుంట‌కు ఈ సారి ఛాన్స్ వ‌స్తుంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా ఉమ్మ‌డి అనంత‌కు మూడు మంత్రి ప‌ద‌వులు.. అందులోనూ రెండు బీసీల‌కు అంటే చంద్ర‌బాబు మంచి ప్ర‌యార్టీ ఇచ్చిన‌ట్టే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: