తెలంగాణ: అక్కడ ముగ్గురూ బీఆర్ఎస్ వాళ్లే పోటీ... ఎవరు ఎంపీ అవుతారో..!
- బీఆర్ఎస్ మాజీ మంత్రి కడియం కూతురు కావ్య కాంగ్రెస్ నుంచి బరిలోకి
- నిన్నటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రమేష్ బీజేపీ క్యాండెట్
- బీఆర్ఎస్ క్యాండెట్గా హన్మకొండ జడ్పీచైర్మన్ సుధీర్
( ఉత్తర తెలంగాణ - ఇండియా హెరాల్డ్ )
విప్లవాల పోరుగడ్డ ఓరుగల్లైన వరంగల్ పార్లమెంట్ బరితో ముగ్గురు బీ ఆర్ ఎస్ నేతలే ఉన్నారు. మూడు ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించారు. అయితే ముగ్గురు బీ ఆర్ ఎస్ నేపథ్యం కలిగినవారే కావడం ఇక్కడ విశేషం. ఒకరు తెలంగాణ ఉద్యమకారుడు, మరోకరు కాంట్రాక్టర్ నుంచి రాజకీయ నాయకుడి అవతారం ఎత్తినవాడు.. మరొకరు తండ్రి దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్నవారు కావడం విశేషం. ఇందులో ఇద్దరు స్వతహాగా డాక్టర్లు కావడం, మరొకరు ఉన్నత విద్యావంతుడే కావడంతో ముగ్గురు ఉన్నత చదువులు చదివినవారే కావడం మరో విశేషం.
ఇక ముగ్గురు మాదిగ సామాజిక వర్గం నేతలే కావడం గమనర్హం. వరంగల్ బరిలో నిలిచిన బీ ఆర్ ఎస్ నేతల గురించి ఒకసారి పరిశీలిద్దాం. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న డాక్టర్ కడియం కావ్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వీర్గీయ నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసి, ఆటు పిమ్మటి తెలంగాణ ఏర్పాటు తరువాత డిప్యూటీ సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన రాజకీయ భీష్ముడు కడియం శ్రీహరి కూతురు కావ్య.
డాక్టర్గా చదవి, ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తూ, గత పదేళ్ళుగా కడియం ఫౌండేషన్ పేరుతో స్వచ్చంద పనులు చేస్తూ, రాజకీయంగా సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచారు.
ముందుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే సీ ఆర్ కడియం కావ్యను వరంగల్ బరిలో బీ ఆర్ ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కడియం శ్రీహరి బీ ఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరారు. కావ్య కూడా తండ్రి బాటలో నడిచి, బీ ఆర్ ఎస్ టికెట్ను వదులుకుని, తండ్రితో పాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
కాంగ్రెస్లో చేరిన వెంటనే ఆధిష్టానం కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక టీ ఆర్ ఎస్ నుంచి రెండుసార్లు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలిచిన ఆరూరి రమేష్ బీజేపీ తీర్థం పుచ్చుకుని బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక బీ ఆర్ ఎస్ అభ్యర్థిగా అనుకున్న కడియం కావ్య బీ ఆర్ ఎస్ కు గుడ్బై చెప్పడంతో ఖంగుతున్న బీ ఆర్ ఎస్ హన్మకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ మారెపల్లి సుధీర్కుమార్ను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ముగ్గురు బీ ఆర్ ఎస్ నేతలే కావడం రాజకీయంగా పోరు రసవత్తరంగా సాగనున్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.