చంద్రబాబు - జగన్ మధ్యలో షర్మిల.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్..?
ఈ సమయంలో తన సొంత అన్న జగన్ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అదేసమయంలో సొంత చిన్నాన్న వివేకా హత్య సహా ఎక్కడో మణిపూర్లో చోటు చేసుకున్న ఎస్సీలపై దాడుల అంశాలను కూడా ఆమె ప్రస్తావించారు. దీంతో పెను కదలిక వచ్చింది. అప్పటి వరకు చాలా రోజులు మౌనంగా ఉన్న వైసీపీ చివరకు వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఇక, ఇప్పుడు కీలకమైన ఎన్నికల సమయంలో షర్మిల చేసే ప్రసంగాలు ఓ రేంజ్లో ఉంటాయనేది అందరూ ఊహిస్తున్నదే.
అయితే.. షర్మిల చేసే ప్రసంగాలు కావొచ్చు.. ఆమె చేసే ఆరోపణలు కావొచ్చు.. ఏ పార్టీకి ప్లస్ అవుతాయి? ఏ పార్టీకి మైనస్ అవుతాయి? అనేది కూడా చర్చగా మారింది. ప్రస్తుతం వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడ దని.. ఆ పార్టీ ఓడిపోవాలని భావిస్తున్న టీడీపీ-జనేసనలు బీజేపీతో కలుపుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో సీట్లు కూడా అతి కష్టం మీద పంచుకున్నాయి. కొన్ని చోట్ల వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా.. సాహసాలు చేశాయి.
ఇలాంటి సమయంలో వైసీపీ వ్యతిరేకతను పెంచడం ద్వారా షర్మిల ఓట్లు చీలిస్తే.. అవి కాంగ్రెస్కు పడతాయా? అలా జరిగితే.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ఒరిగేది ఏంటి? అనేది ఆసక్తి రేపు తున్న ప్రశ్న. షర్మిల చీల్చే ఓట్లు ఆ పార్టీకి ప్లస్ కానున్నాయని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చాలా వ్యూహాత్మకంగా అబ్యర్థులను ఎంపిక చేసుకుంటోంది. దీంతో వ్యక్తుల బలం కూడా తోడై.. షర్మిల ప్రచారానికి ఓట్లు చీలడం ఖాయం. అయితే.. అవి కూటమికి కాకుండా.. కాంగ్రెస్కు పడితే.. కూటమిపైనే ప్రభావం పడుతుందనే లెక్కలు వస్తున్నాయి. మరి ఏంజరుగుతుందో చూడాలి.