తెలంగాణలో లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ!

Veldandi Saikiran
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును, వైద్యాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నగరపాలికల్లో సామాన్యులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు హైదరాబాద్ తరహాలో మరిన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సిఎం నిర్ణయించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంలో వైద్య ఆరోగ్య శాఖపై సిఎం కెసిఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

సిఎం కెసిఆర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న వైద్యాధికారులు రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను సిఎం కు వివరించారు. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని, ఎట్టి పరిస్థితుల్లో గుంపులు గుంపులుగా ఉండరాదని, ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా కరోనా నియంత్రించవచ్చని వైద్యాధికారులు తెలిపారు. లాక్ డౌన్ అవసరం ప్రస్తుతం లేదని వారు సిఎం కు నివేదిక ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో అజాగ్రత్త పనికిరాదన్నారు. నిరంతరం  ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. పని చేసే దగ్గర అప్రమత్తంగా ఉంటూ మాస్క్ లు ధరించాలని, ప్రభుత్వం జారీ చేసే కోవిడ్ నిబంధనలను పాటించాలని సిఎం కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లతో కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని సిఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖను సన్నద్ధం చేయడం కోసం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ...రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న మొత్తం బెడ్లల్లో దాదాపు 99 శాతం బెడ్లను ఇప్పటికే ఆక్సిజన్ బెడ్లుగా మార్చారని, మిగిలిన మరో శాతాన్ని కూడా తక్షణమే ఆక్సిజన్ బెడ్లుగా మార్చాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. గతంలో రాష్ట్రంలో కేవలం 140 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం మాత్రమే ఉన్న ఆక్సిజన్ ఉత్పత్తిని ఇప్పుడు 324 మెట్రిక్ టన్నులకు పెంచుకోగలిగామని, ఆక్సిజన్ ఉత్పత్తిని 500 మెట్రిక్ టన్నుల వరకు పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ వైద్యశాఖాధికారులను ఆదేశించారు. హోం ఐసోలేషన్ చికిత్స కిట్లను 20 లక్షల నుంచి ఒక కోటి లభ్యతకు చర్యలు చేపట్టాలని,  ప్రస్తుతం 35 లక్షలున్న టెస్టింగ్ కిట్లను రెండు కోట్లకు పెంచాలని సిఎం ఆదేశించారు. అన్ని దవాఖానాల్లో డాక్టర్లు తక్షణం అందుబాటులో ఉండేలా చూడాలని, ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని సిఎం వైద్యాధికారులను ఆదేశించారు. ఏ కారణం చేతనైనా ఖాళీలు ఏర్పడితే 15 రోజుల్లో భర్తీ చేసుకునే విధంగా విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. పెరుగుతున్న జనాభా అవసరాలరీత్యా జనాభా ప్రాతిపదికన, రాష్ట్రంలో డాక్టర్లు, బెడ్లు మౌలిక వసతులను పెంచుకొని వైద్యసేవలను మెరుగుపరచాలని సిఎం అన్నారు. నూతనంగా నిర్మించుకున్న సమీకృత కలెక్టర్ కార్యాలయాల్లోకి పలు శాఖల కార్యాలయాలు మారుతున్న దృష్ట్యా ఖాళీ అయిన పాత కలెక్టరేట్ కార్యాలయాలను, ఆయా శాఖల భవనాలను, స్థలాలను విద్యా, వైద్య శాఖ అవసరాల కోసం ప్రత్యేకించి కేటాయించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: