వరుస రెండు ఎన్నికలు.. 2014,2019.. రెండు సార్లూ గెలిచింది కింజరాపు రామ్మోహన్ నాయుడే. శ్రీకాకుళం రాజకీయాల్లో కింజరాపు కుటుంబానికి మంచి స్థానం ఉంది అని నిరూపించేందుకు ఆ గెలుపులే కారణం. ఎంపీ రామూ తన పరిధిలో పనిచేసి ఈ రెండు పర్యాయాలూ ఎంతో పేరు తెచ్చుకున్నారు. తెచ్చుకుంటున్నారు కూడా! వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మాట్లాడలేని చాలా విషయాలు కూలంకుషంగా మాట్లాడతారు ఆయన. ముఖ్యంగా నాన్న ఎర్రన్నాయుడి వారసత్వం అందుకుని జిల్లా రాజకీయాల్లోకి వచ్చిన ఈ బీటెక్ ఎంబీఏ గ్రాడ్యుయెట్ కు జనాలను కలుపుకునే తత్వం ఎక్కువ. ముఖ్యంగా కష్టం అంటే వెంటనే స్పందిస్తాడు. తన పరిధిలో చేతనైనంత సాయం చేసే పంపుతాడు. అందుకే గులాబీ దండులో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎక్కడో ఉన్న మహబూబా బాద్ లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. దేశ రాజధానిలో మన ప్రాంత సమస్యలు, మన రాష్ట్ర సమస్యలు వినిపించి, సుదీర్ఘ పోరాటం చేసిన ఘటన ఎర్రన్న బిడ్డ రామూదే!
ఇప్పుడు ఆయనను ఓడించేందుకు జగన్ వ్యూహాలు పన్నుతున్నారు. గతంలో ఆయన పై పోటీచేసిన రెడ్డి శాంతి కానీ, దువ్వాడ శ్రీను కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో జనంలోకి వెళ్లలేకపోయారు. నాన్న మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉంటూ కూడా కుటుంబం ఇచ్చిన సలహాతో ప్రోత్సాహంతో రాజకీయంలోకి వచ్చారు రాము. అటుపై సైకిల్ యాత్ర చేశారు. మంచి పేరు తెచ్చుకున్నారు. జనాల్లోకి అప్పుడే చొచ్చుకు పోయి సామాన్యుల గొంతుక విన్నారు. ఆ విధంగా ఆయన మంచి పేరుకు కేరాఫ్ అయ్యారు. మంచి నాయకుడిగా ఎదిగారు. ముఖ్యంగా తిత్లీ సమయంలో క్షేత్ర స్థాయిలో తిరిగి వారి సమస్యలను అధినాయకత్వానికి విన్నవించారు. అదేవిధంగా లాక్డౌన్ సమయంలో రిమ్స్ ఆస్పత్రి రోగులకు నెలరోజుల పాటు రెండు పూటలా భోజన సదుపాయం కల్పించారు.
తన తండ్రి స్థాపించిన భవానీ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎందరికో సాయం చేశారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లు తనకు తెలిసిన స్వచ్ఛంద సంస్థ సాయంతో హైద్రాబాద్ నుంచి ఇక్కడికి రప్పించి వాటిని జిల్లా ఆస్పత్రికి అందించారు. తన స్నేహితుల సాయంతో రిమ్స్ ఆస్పత్రిలోనే 40 ఆక్సిజన్ బెడ్లతో కూడిన చిల్డ్రన్ వార్డు ఒకటి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రవాసాంధ్రుల సమస్యలను ఎన్నింటినో విదేశాంగ శాఖకు లేఖలు ద్వారా విన్నవించి పరిష్కరించారు. ఇప్పుడీయనపై నరసన్నపేట ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారని ఓ ప్రాథమిక సమాచారం.