దేవరగట్టు కర్రల సమరంలో దారుణం..!?
ఈ దేవరగట్టు కర్రల సమరం.. కర్నూలు జిల్లా హోలగుంద మండలంలో జరుగుతుంది. ఇక్కడ దసరా రోజు రాత్రి బన్ని ఉత్సవం జరగడం ఆనవాయితీ... అదే సంప్రదాయం మరోసారి నెత్తురు చిందించింది. శుక్రవారం రాత్రి జరిగిన ఉత్సవంలో జనం భారీగా పాల్గొన్నారు. దాదాపు వంద మందికి పైగా గాయాలపాలయ్యారు. అంతే కాదు.. కొందరికి కాగడాల నిప్పు అంటుకుని గాయపడ్డారు.
ఇక్కడ కర్రల సమరం జరగుతుుందని ముందే తెలుసు.. పోలీసులు భారీగానే బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాది మందిని మోహరించారు. అంతే కాదు.. ఈసారి డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. అయినా సరే.. కర్రల సమరం ఆగలేదు. వేల సంఖ్యలో వచ్చిన భక్తులు తమ వెంట తెచ్చుకున్న కర్రలతో సమరం సాగించారు. మాలమళ్లేశ్వరస్వామిని దక్కించుకునేందుకు రెండు గ్రామాల వాళ్లు చేసే పోరాటమే ఈ దేవరగట్టు కర్రల సమరం.
దేవరగట్టులోని దసరా రోజు రాత్రి స్వామి వారికి కల్యాణం నిర్వహించారు. తర్వాత గ్రామోత్సవం నిర్వహించి స్వామి వారిని ఊరేగింపుగా తీసుకొస్తారు. అప్పుడే మొదలవుతుంది కర్రల సమరం. స్వామిని దక్కించుకునేందుకు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. ఈ సమరంలో విజయం సాధించిన వారు స్వామి వార్లను వారి ఊరికి తీసుకెళ్తారు. ఈసారి కూడా వేలాదిగా వచ్చిన భక్తులు కర్రలతో సమరం చేశారు. వందల మంది గాయపడ్డారు. పరిస్థితి విషమించిన నలుగురిని చికిత్స కోసం ఆదోనికి తరలించారు. ఈ నిషేధంపై 2008లోనే నిషేధం విధించినా ఇంకా కొనసాగుతూనే ఉంది. జనంలో మార్పు లేకుండా చట్టాలు మాత్రం ఎంతని కట్టడి చేస్తాయి.