మేడిగడ్డ విచారణ షురూ: ఎవరి గుండెలు అదురుతున్నాయో?
మేడిగడ్డ ఆనకట్ట లోపాలు, అంశాలపై బహిరంగ ప్రకటన ఇచ్చి ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తామని... ఎవరైనా అఫిడవిట్ దాఖలు చేసి అభిప్రాయాలు చెప్పవచ్చని జస్టిస్ పినాకినీ చంద్ర ఘోష్ తెలిపారు. సాక్ష్యాలు సమర్పించవచ్చని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ఇందుకోసం నెల రోజుల గడువు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత సమన్లు జారీ చేసి ఆనకట్టల పనులతో సంబంధం ఉన్న వారిని విచారణకు పిలుస్తామని వివరించారు. మేడిగడ్డ ఆనకట్టపై అధ్యయనం చేసిన ఎన్డీఎస్ఏ కమిటీ నుంచి నివేదిక త్వరగా తెప్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినట్లు పీసీ ఘోష్ చెప్పారు.
ఇంజనీర్లు, ఎన్ డీ ఎస్ ఏ కమిటీతో సమావేశమవుతామన్న జస్టిస్ పినాకినీ చంద్ర ఘోష్... అవసరమైతే ఐఐటీ తదితర సాంకేతిక నిపుణుల సహాయం తీసుకుంటామని పేర్కొన్నారు. కాళేశ్వరంపై కంప్ట్రోలర్ అండ్ జనరల్ - కాగ్ ఇచ్చిన నివేదికను చివర్లో పరిశీలిస్తానని జస్టిస్ పినాకినీ చంద్ర ఘోష్ అన్నారు. తదుపరి పర్యటనలో మేడిగడ్డ వెళ్లి ఆనకట్టను పరిశీలిస్తానని జస్టిస్ పినాకినీ చంద్ర ఘోష్ తెలిపారు.
అన్ని అంశాలు, సాక్ష్యాలు వచ్చాక విచారణకు ఎవరిని పిలవాలో నిర్ణయిస్తానని జస్టిస్ పినాకినీ చంద్ర ఘోష్ తెలిపారు. తాను ముఖాలను చూసి విచారణ చేయబోనని... వాస్తవాలు, సాక్ష్యాల ప్రాతిపదికన న్యాయపరిధిలో విచారణ కొనసాగుతుందని జస్టిస్ పినాకినీ చంద్ర ఘోష్ అన్నారు. వంద రోజుల్లోపు విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్న జస్టిస్ ఘోష్... ప్రజాప్రయోజనం దృష్ట్యా వీలైనంత త్వరగా తేల్చాల్సిన అవసరం ఉందన్నారు.