కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎందుకంటే అటు అధికార టీఆర్ఎస్, బీజేపి ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించాయి. కానీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థి ఎంపికపై ఇప్పటికీ మల్లగుల్లాలు పడుతోంది. అయితే, అధికారం పార్టీ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో చిరాకు పడుతున్నట్టు తెలుస్తోంది. హుజురాబాద్పై కాంగ్రెస్ వ్యూహం ఎంటిదనేది ఇప్పటికి సస్పెన్స్గానే ఉంది.
అది ఆ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ఇతర పార్టీల్లో మాత్రం కలవరపాటు మాత్రం కనిపిస్తోంది. అయితే, హుజురాబాద్లో టీఆర్ఎస్ నాయకులు ఎందుకో భయపడుతున్నట్టు కనిపిస్తోంది. అధికార కలవరపాటుకు కారణం లేకపోలేదు. హుజురాబాద్ లో గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ చేయని ప్రయత్నమంటూ లేదు. మంచి చెడు అన్న తేడా లేకుండా అన్ని అస్త్రాలను సందిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలకు మభ్యపెడుతుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
అంతే కాదు దళిత కుటుంబాలు రూ. 10 లక్షలు పంపిణీ చేసేందుకు దళితబంధు పథకాన్ని కూడా ప్రకటించింది. అది కూడా హుజురాబాద్లో గెలిచేందుకే ఈ పథకం అని కేసీఆర్ బహిరంగంగా వెల్లడించారు కూడా. దేశంలో ఎక్కడా ఏ ఉప ఎన్నికల్లోనూ ఖర్చు చేయని విధంగా ఇప్పటికే అధికార పార్టీ హుజురాబాద్ లో ఖర్చు చేసిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇంత చేసినా అధికార పార్టీని మాత్రం ఓటమి భయం వెంటాడుతూనే ఉంది.
అయితే, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే ఆ ఓట్లు చీలి టీఆర్ఎస్ కు పడుతాయని భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఎటు తేల్చకపోవడంతో టీఆర్ఎస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ కలిసిపోతున్నాయని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వ్యూహాలు ఏ విధంగా ఉంటాయనేది టీఆర్ఎస్ నాయకులకు కంటి మీద కునుకులేకుండా చేస్తుందని సమాచారం. దీంతో రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ మొదలుపెట్టినట్టుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.