అశోక్ గజపతి అరెస్టుకు స్కెచ్ రెడీ..?
అశోక్ గజపతి ఛైర్మన్గా ఉన్న మాన్సాస్ ట్రస్టులో అక్రమాలు జరిగాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అంటున్నారు. బొబ్బిలిలో 4వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెబుతున్నారు. మాన్సాస్, సింహాచలం ఆస్తుల విషయంలో అవకతవకలు బయటపడ్డాయని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు. అవకతవకలకు పాల్పడ్డ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశామని.. ఇంకా పెద్ద పెద్ద స్కామ్లు జరిగాయని అంటున్నారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
అంతే కాదు.. త్వరలోనే ఆ పెద్ద స్కామ్లు బయటపెడతామని... మాన్సస్ చైర్మన్ అశోక్ గజపతి రాజు కూడా తప్పు చేశారని తేలితే చర్యలు తప్పవని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఖరాఖండీగా చెప్పారు. సింహాచలం భూములు అన్యాక్రాంతమైతే ఛైర్మన్ అశోక్ గజపతి కాపాడలేకపోయారని మంత్రి అంటున్నారు. కొన్ని వందల ఎకరాలు అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయని.. వాటిని బయటపెడతామని మంత్రి అంటున్నారు. బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆభరణాలు కోటలో ఉండాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్న వెల్లంపల్లి.. ఆస్తులు, నగలను కాపాడతామంటున్నారు. తప్పు చేసినవారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు.
ఇక ఇదే అంశంపై స్పందించిన మరో మంత్రి బొత్స.. టీడీపీ అధికారంలో ఉండగా బొబ్బిలి విషయంలో కోర్టుకు వెళ్లాల్సిన పనేముందని ప్రశ్నించారు. ఆరోపణ వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధికి ఉండాలన్నారు. ఈ మాటలన్నీ చూస్తే.. అశోక్ గజపతి రాజును అరెస్టు చేసేందుకు ప్లాన్ రెడీ అవుతుందేమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి.