కష్టకాలంలో విద్వేష వైఖరి న్యాయమేనా..?
ఈ పరిణామాల తరువాత హైదరాబాద్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులు 45 శాతం పడకలను ఆక్రమించినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే కోవిడ్ బారిన పడిన బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో వైద్యసదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రకటన వెలువడటంతో ఈ విషయంపై సోషల్ మీడియా లో మరోసారి ప్రాంతీయత అంశం ప్రాధాన్యం సంతరించుకుని నెటిజన్ల మధ్య స్పష్టమైన చీలిక తీసుకువచ్చింది. మన సొంత ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిన సమయంలో ఇతర రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్లో పడకలను ఆక్రమించటానికి ప్రభుత్వం ఎందుకు అనుమతించాలంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. మరికొందరు ఏపీ ప్రజల మీద అసభ్యకరమైన పోస్టులకు తెగబడుతున్నారు. ఈ ధోరణి నెమ్మదిగా ప్రాంతీయ విద్వేషానికి దారితీస్తోందన్న ఆందోళనను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి 2024 వరకు ఏపీకి కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందన్న విషయం ఉద్దేశపూర్వకంగా పలువురు మరచిపోతున్నారు. సామాన్య ప్రజల మాట ఎలా ఉన్నా రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు ఇలాంటి సున్నిత అంశాల విషయంలో మరింత సంయమనంతో, బాధ్యతాయుతంగా వ్యవహరించడం ఇప్పుడు చాలా అవసరమని చెప్పాలి. నిజానికి హైదరాబాద్ ఆసుపత్రుల్లో ఉన్న రోగులు కేవలం ఏపీకి చెందినవారు మాత్రమే కాదు. పలు ఇతర రాష్ట్రాలవారూ ఉన్నారు. అంతేకాదు.. దేశంలోని ప్రముఖ నగరాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంది. కానీ సోషల్ మీడియాలో ఏపీ ప్రజల అంశాన్నే ప్రస్తావించడం విచారకరమనే చెప్పాలి. ఇలాంటి సంక్షోభ సమయాన్ని అధిగమించాలంటే రాష్ట్రాల మధ్య మెరుగైన సమన్వయం, ప్రజల మధ్య ఐక్యతాభావం అవసరమని అందరూ గుర్తించాల్సి ఉంది.