ఉప ఎన్నికల్లో ఓటింగ్ పెంచాలంటే ప్రచారంలో జోరు పెరగాలి: సంతోష్‌ అజ్మీర

Satvika
ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు ముగిసిన అనంతరం పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. వీటి తంతు పూర్తవ్వకుండానే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఎన్నికలలో ఓటింగ్ ను గతంలో కన్నా ఈ ఏడాది పెంచేందుకు అధికారులు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు తిరుపతిలోని శ్రీ పద్మావతీ విశ్రాంతి గృహంలో శుక్రవారం లోక్‌సభ ఉప ఎన్నికపై చిత్తూరు, నెల్లూరు జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, తిరుపతి ఆర్డీవోతో ఆయన సమావేశమయ్యారు.


ప్రచారంలో భాగంగా ర్యాలీలు, సోషల్‌ మీడియా, కల్చరల్‌ టీమ్‌లు, మొబైల్‌ ఆటోల ద్వారా అవగాహన కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టాలని సంతోష్‌ అజ్మీర సూచించారు.ఓటర్ల హెల్ప్‌లైన్‌ యాప్‌, పోస్టల్‌ బ్యాలెట్‌, సీ-విజిల్‌ కార్యక్రమాలను విశ్వవిద్యాలయం విద్యార్థుల సహకారంతో చేపట్టాలని సూచించారు.. అనంతరం చిత్తూరు జిల్లా జేసీ రాజశేఖర్ మాట్లాడారు. తిరుపతి లోక్‌సభ పరిధిలో జిల్లాలో 167- తిరుపతి, 168- శ్రీకాళహస్తి, 169- సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. గతంలో తిరుపతిలో 66 శాతం, శ్రీకాళహస్తిలో 89 శాతం, సత్యవేడులో 85 శాతం పోలింగ్‌ నమోదైందనీ వెల్లడించారు..


నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట , వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. గతంలో 82 శాతం ఓటింగ్‌ నమోదు అయిందని వివరించారు. ఓటింగ్‌ శాతం పెంచడానికి అన్ని రకాల ప్రచార కార్యక్రమలు చేపడతామని నెల్లూరు జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్డీవో కనకనరసారెడ్డి మాట్లాడుతూ అర్బన్‌ లోకల్‌ బాడీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. ఎస్‌ఎస్‌ఆర్‌ 2021 తయారీ సమయంలో ఇంటింటి సర్వే నిర్వహించి నకిలీ ఓటర్లను తొలగించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయాల వ్యవస్థ ఉందని, విస్తృత ప్రచారం కల్పించనున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల డీటీలు విజయభాస్కర్‌, మస్తానయ్య, ప్రతాప్‌ నాయక్‌, పవన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: