ఆ జర్నలిస్ట్ స్టోరీ రాస్తే.. హెచ్.ఆర్.సీకే దిమ్మతిరిగిపోయింది..?
శ్యామ్ మోహన్.. ఓ ఫ్రీలాన్స్ జర్నలిస్టు.. మిగిలిన పాత్రికేయుల్లా కాకుండా.. ఎక్కువగా గ్రామీణ అంశాలపై ఫోకస్ చేస్తుంటారు. గ్రామాలు, రైతులు, బడుగు జీవుల కష్టాలు ఆవిష్కరిస్తారు. తాజాగా ఆయన ఓ పత్రికలో భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం గురించి కళ్లకు కట్టినట్టు రాశారు.
కొత్తగూడెం నుండి 70 కిలో మీటర్లు వెళ్లి, మోకాళ్ల లోతు వాగు దాటితే లక్ష్మీదేవిపల్లి మండలంలో క్రాంతినగర్ తండా కనిపిస్తుంది. అక్కడ సుమారు వంద గడప లుంటాయి. ఈ ప్రాంతం అభయారణ్యం లోపల ఉండటంతో విద్య, వైద్యం, విద్యుత్ వంటి కనీస అవసరాలు అందుబాటులో ఉండవు. మూడు దశాబ్దాల క్రితం ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన ఆదివాసీలు ఇక్కడ అడవులను ఆసరా చేసుకొని స్ధిర పడిపోయారు. వారికి తెలుగు, గోండు, కోయ భాషలు తెలుసు.
ఆ ప్రాంతంలో నివశించే ఓ వృద్ధుడి జీవితాన్ని శ్యామ్ మోహన్ ఆవిష్కరించారు. క్రాంతినగర్ తండా వాసి, సోడి గంగ వయస్సు 70 ఏళ్లకు పైమాటే. అయినా ఉత్సాహంగా రోజూ ఆరు కిలో మీటర్లుకు పైగా నడుస్తాడు. ఉదయం తన రెండు ఎకరాల పొలంలోకి వెళ్లి రోజంతా పని చేసి సాయంత్రం ఇంటికి చేరు కుంటాడు. ఎంత ఎండ ఉన్నా చెప్పులు వేసుకోడు. వర్షం వస్తే తడుస్తాడు తప్ప గొడుగు కూడా వేసుకోడు. శీతాకాలపు చలిలో చలిమంటల పక్కన తన కుటుంబంతో కాసేపు గడుపుతాడు తప్ప వంటి మీద చొక్కా వేసుకోడు. గొంగలి కప్పుకోడు. ఎందుకిలా అంటే? అలా ఉండటం అల వాటయి పోయిందని నవ్వుతాడు.
శ్యాంమోహన్ రాసిన ఈ కథనం చూసి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గిరిజనుల సమస్య పై స్పందించింది. ఈ కథనాన్ని సూమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. జిల్లా పాలనాధికారులను ఈ గిరిజనుల సమస్య పై వివరణ కోరింది.