ఏపీ టీడీపీకి బిగ్ షాక్ !
టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. పితాని పార్టీ మారేందుకు రెడీ అయ్యారని, వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రచారం జరుగుతోంది. పితాని సత్యనారాయణ అనుచరుల్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయం వరకు సైలెంట్గా ఉండాలని, ఎన్నికల టైమ్లో ఆయనకు వైసీపీ కండువా కప్పేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని సమాచారం.
పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముచిక్కాల గ్రామానికి చెందిన పితాని సత్యనారాయణ మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014 సంవత్సరంలో టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి చంద్రబాబు కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆచంట నుంచి ఓడిపోయారు. అక్కడ పితాని మీద గెలిచిన చెరుకువాడ శ్రీరంగనాథ రాజుకు జగన్ కేబినెట్లో మంత్రిపదవి కూడా దక్కింది.
వైసీపీలో చేరేందుకు రెడీ అయిన పితాని సత్యనారాయణ తనకు పాలకొల్లు టికెట్ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. జగన్ నుంచి టికెట్ మీద హామీ లభించిన వెంటనే ఆయన వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయంగా సమాచారం. పితానికి పాలకొల్లు హామీ ఇస్తే.. 2019 ఎన్నికల్లో ఆయన పై గెలిచిన మంత్రి చెరుకువాడకు ఇబ్బంది ఉండకపోవచ్చని చెబుతున్నారు.