మరోమారు ఇండోనేషియాను కుదిపేసిన భారీ భూకంపం... ఏడుగురు మృతి, వందల్లో క్షతగాత్రులు
భూకంపం తీవ్రతకు పలు ఇళ్లు, హోటళ్లు, మముజులోని ఓ ఆసుపత్రి నేలమట్టమయ్యాయి. ఆసుపత్రి కూలిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు రోగులు, హాస్పిటల్ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది ఓ భవనం శిథిలాల కింద చిక్కుకోవడంతో వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. భూకంపం ధాటికి రహదారులు రెండుగా చీలిపోయి.. చాలా భవనాలు కూలిపోయాయని స్థానిక యువకుడు ఒకరు అన్నారు. భూకంపం చాలా తీవ్రంగా వచ్చిందని, నా భార్యతో కలిసి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగెత్తానని తెలిపాడు. గురువారం కూడా ఇదే ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూమి కంపించింది. గడచిన 24 గంటల్లో పలుసార్లు భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో మూడు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పసిఫిక్ మహాసముద్రంలోని‘రింగ్ ఆఫ్ ఫైర్’కారణంగా ఇండోనేసియాలో భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలవడం లాంటి విపత్తులు తరచుగా సంభవిస్తుంటాయి. సులవేసి దీవిలో 2018లో 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి సునామీ వచ్చింది. ఆ ప్రకృతి విపత్తులో 4,300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచాన్ని కుదిపేసిన 2004 డిసెంబరులో 9.1 తీవ్రతో భూకంపం సంభవించి సునామీ వచ్చింది. నాటి సునామీలో మొత్తం 220,000 మంది చనిపోగా.. ఒక్క ఇండోనేషియాలోనే 17,0000 మందిని బలితీసుకుంది.