ఢిల్లీ ప్రజలకు మీరు ఇవ్వకపోతే మేమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం - సీఎం కేజ్రీవాల్
‘‘కేంద్రం ఏం చేస్తుందో చూస్తాం. ఒక వేళ అవసరమైతే.. కేంద్రం ఉచితంగా టీకా వేయించలేకపోతే.. ఢిల్లీ ప్రజలకు మేం ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తాం’’ అని కేజ్రీవాల్ తెలిపారు. వ్యాక్సినేషన్ గురించి రూమర్లు ప్రచారం చేయొద్దని ఆయన కోరారు. అన్ని ప్రొటోకాల్స్, జాగ్రత్త చర్యలను అనుసరించే కేంద్రం మరియు ఆరోగ్య శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ను తీసుకొచ్చారని ఢిల్లీ సీఎం తెలిపారు. కాబట్టి వ్యాక్సిన్ విషయంలో అనుమానాలు వద్దని.. టీకా వేయించుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ వ్యాక్సిన్తో కరోనా వైరస్ నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని 89 కేంద్రాల్లో శనివారం నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం అవుతుంది. అయితే ఇటీవలే జనవరి ఆరంభంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల, వర్గాల ప్రజలు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.