తెలంగాణ లో ఆసక్తి కరంగా జరగనున్న మరో ఎమ్మెల్సీ ఎన్నిక..?
ఈ నేపథ్యంలో రాష్ట్రం లో మరో ఎన్నిక ఇప్పుడు ఆసక్తి కరంగా మారిపోయింది.. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక మరి కొన్ని రోజుల్లో జరగాల్సి ఉంది. నిజామాబాద్ కు చెందిన ఆకుల లలిత ఎమ్మెల్సీ పదవి కాలం మరికొద్ది నెలల్లోనే ముగియనుంది. దాంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఇది ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నిక కావడంతో అధికార పార్టీ టీఆర్ఎస్ కే ఈ పదవి దక్కనుంది. కాంగ్రెస్ పార్టీ తరపున అరంగేట్రం చేసిన ఆకుల లలిత 2018 ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. అయితే టీ ఆ ఎస్ లోకి వచ్చిన ఆమెకు కేసీఆర్ హామీ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో పదవులను ఎక్కువగా ఇస్తున్నారు.
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అదే ప్రాంతానికి చెందిన సురేష్ రెడ్డికి అవకాశం కల్పించారు. తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన కుమార్తె కవితను కేసీఆర్ ఎంపిక చేశారు. అయితే ఆకుల లలిత కూడా అదే జిల్లాకు చెందిన వారు. మరోసారి ఆ జిల్లాకు పదవి దక్కుతుందనే ప్రచారం టీఆర్ఎస్ పార్టీలో ఉంది.ఎమ్మెల్యే కోటా కావడంతో ఈ ఎన్నిక కేవలం నామమాత్రమే అయినా ఆకుల లలిత తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేతను కోరనున్నట్లు తెలిసింది. ఆమె కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.