ఘోరం: భార్యను మర్డర్ చేయమని భారీమొత్తంలో సుపారీ.!
సరిగ్గా అదే కోవకు చెందుతాడు ఇపుడు మనం చెప్పుకోబోయే క్రూరుడు. అవును.. అగ్నిసాక్షిగా తాళికట్టిన భార్యను చంపేందుకు కుట్ర పన్నాడు ఓ నీతిమాలిన భర్త. సొంత పెళ్ళాన్ని హతమార్చేందుకు భారీ మొత్తంలో దుండగులకు సుపారీ ఇచ్చాడు. కాగా.. కుట్రను పసిగట్టిన పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. అనంతరం వీరి వద్ద నుండి కత్తులను, కొడవళ్లను, బాకులను స్వాధీనం చేసుకున్నారు.
స్థానికంగా కలకలం రేపిన ఈ దుశ్చర్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఘటన తాలూక వివరాలిలా ఉన్నాయి. గోదావరిఖని ప్రాంతానికి చెందిన అశోక్, ఇల్లందు కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యుటర్గా పనిచేసే రజిత కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇటీవల జరిగిన కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరువురు వేర్వేరుగా కాపురం పెట్టారు. కాగా భార్య మీద పగతో రగిలిపోతున్న అశోక్ ఆమెను ఎలాగైనా అంతం చేయాలని ప్లాన్ వేశాడు.
ఈ ప్లాన్ లో భాగంగా ఖమ్మం జిల్లా పరిధిలోని నెలకొండపల్లి గ్రామానికి చెందిన భూక్య వీరబాబు, కొత్తూరి ప్రసాద్ అనే ఇద్దరిని కలిసి తన అక్కసుని వెళ్లగక్కాడు. ఈ క్రమంలో తన భార్యను చంపేందుకు వారికి సుపారీ ఇచ్చాడు. డీల్ 10 లక్షలకు సెట్ చేసి, అడ్వాన్స్ గా రూ. 3 లక్షలు ఇరువురికీ ముట్టజెప్పాడు. అయితే భర్త కదలికలను పసిగట్టిన భార్య రజిత అప్పటికే పోలీసులకు రిపోర్ట్ చేసింది. దానిలో భాగంగా కుట్రను పసిగట్టిన ఇల్లందు సీఐ రమేశ్ తన సిబ్బందితో కలిసి నిందితులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టాడు.