కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను బలి తీసుకుంది. అగ్ర రాజ్యం అమెరికాతో మొదలు పెడితే యూరప్ దేశాలు.. ఇటు ఆసియా దేశాలు కరోనా దెబ్బతో కుదేలయ్యాయి. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను సర్వనాశనం చేసింది. ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా నాశనం అయిపోయాయి. ఇక ఇటు భారత్లో లాక్ డౌన్ దెబ్బతో ఎన్నో లక్షల మంది అతలా కుతలం అయ్యారు. కొన్ని వేల మంది ప్రజలు ఉపాధి లేక చనిపోయారు. కరోనా వైరస్ వచ్చిందనుకుంటోన్న సమయంలోనే ఇప్పుడు కొత్త కరోనా వైరస్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.
తాజాగా కరోనా గురించి బయటకు వచ్చిన ఓ విషయం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఇప్పటికే పలువురికి కరోనా రెండు లేదా మూడు సార్లు పాజిటివ్ గా వచ్చిందన్న విషయం మనకు తెలుసు. అయితే ఓ మహిళకు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 31 సార్లు కరోనా పాజిటివ్ వచ్చింది. మరో షాక్ ఏంటంటే ఆమెకు ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినా కూడా 31 సార్లు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఎంతో మంది డాక్టర్లు, వైద్య నిపుణులు ఆమె రక్త నమూనాలు సేకరించి ప్రత్యేక అధ్యయనం చేస్తున్నారు.
అన్ని సార్లు కరోనా సోకిన ఆ మహిళ ఎవరో కాదు మన దేశానికే చెందిన మహిళ. రాజస్తాన్ లోని అప్పాఘర్ ఆశ్రమానికి చెందిన శారదకు ఎలాంటి కరోనా లక్షణాలు లేకుండానే ఏకంగా 31 సార్లు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను భరత్ పూర్ జిల్లాలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గతేడాది ఆగస్టు 20వ తేదీన ఆమెకు తొలిసారి కరోనా పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత పలుసార్లు జరిపిన పరీక్షల్లో ఆమెకు 31 సార్లు ఈ పాజిటివ్ వచ్చింది. ఈ ఏడెనిమిది నెలల్లోనే ఆమె ఏకంగా 8 కిలోల వరకు బరువు కూడా పెరిగారు.