సీఎం జగన్ కి రఘురామ లేఖ.. అరెరే కేసీఆర్ ను కూడా ఇన్వాల్వ్ చేసాడే..?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అంశం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఓవైపు ప్రతిపక్ష పార్టీ నేతలు జగన్ సర్కార్ పాలనకు ఆకర్షితులవుతుంటే.. అధికార పార్టీ నేత ఆయన రఘురామకృష్ణంరాజు మాత్రం జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా నే ముందునుంచి అడుగులు వేస్తున్నారు. ఇక జగన్ చేసిన కొన్ని పనులను ప్రత్యక్షంగానే విమర్శించారు రఘురామకృష్ణంరాజు. ఏదో అంశాన్ని లేవనెత్తుతూ జగన్ సర్కార్ పై ఏదో ఒక విధంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక ఆ తర్వాత రఘురామకృష్ణంరాజు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేయడం కూడా సంచలనంగా మారిపోయింది.
రఘురామకృష్ణంరాజు అంశం ఆంధ్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఎంపీ రఘురామ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆయన. భారత చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ వ్యక్తి పీవీ నరసింహారావు అంటూ లేఖలో తెలిపారు రఘురామకృష్ణంరాజు. తెలుగు ప్రజల స్ఫూర్తి అయిన పి.వి నరసింహా రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం అటు ప్రభుత్వానికి కూడా మంచిదే అంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఈ లేఖలో కేసిఆర్ సర్కార్ గురించి కూడా వ్యాఖ్యానించారు రఘురామకృష్ణంరాజు.
కేసీఆర్ సర్కార్ పీవీ జయంతి వేడుకలను నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు . ఈ వేడుకల కోసం ఏకంగా పది కోట్లు కేటాయించారని... గుర్తు చేశారు. పీవీ నరసింహారావు జయంతి వేడుకలు నిర్వహించేందుకు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ ను కోరారు. గతంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సైతం పీవీ నరసింహారావు.. జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేవారు అంటూ గుర్తు చేశారు రఘురామకృష్ణంరాజు. మరి దీనిపై జగన్ సర్కారు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.