బిగ్బ్రేకింగ్: బ్లడ్బ్యాంకుల్లో కొరత.. ఆ పేషెంట్ల పరిస్థితి ఏమిటో..!
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి లాక్డౌన్ విధించింది. కరోనా వైరస్ కట్టడికి ప్రజలందరూ సహకరించాలని ప్రధాని మోడీ కోరారు. మనల్ని మనం కాపాడుకోవడానికి తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కట్టుబడి ఇళ్లకే పరిమితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. హఠాత్తుగా విధించిన లాక్డౌన్తో పలు అత్యవసర సేవలు అందించే రంగాలు కొంత ఇబ్బందికి గురవుతున్నాయి. ఇందులో ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్లడ్ బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా పలు స్వచ్ఛంద సంస్థలు, పలు పార్టీలు, ఇత ప్రైవేట్ సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహించి, బ్లడ్ బ్యాంకులకు అందించేవి. లాక్డౌన్తో రక్తదాన శిబిరాల నిర్వహణ ఆగిపో్వడంతో ఆస్పత్రుల్లో పేషెంట్లకు అవసరమైన రక్తాన్ని సప్లయ్లో కొరత ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా.. పశ్చిమబెంగాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో.. రక్తదాన శిబిరాలు నిర్వహించే సంస్థలు కూడా తమ కార్యకలాపాలను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతోంది.
ఇక్కడ అతిముఖ్యమైన విషయం ఏమిటంటే.. తలసేమియా తదితర వ్యాధులతో బాధపడుతున్న వారికి నిత్యం రక్తం అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో రక్తదాన శిబిరాల నిర్వహణ ఆగిపోవడంతో.. అవసరమైన రక్తం కూడా బ్లడ్ బ్యాంకులకు అందడం లేదు. దీంతో అక్కడి నుంచి ఆస్పత్రులకు కూడా సరఫరా చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. రక్తదానం ప్రాణదానంతో సమానమని అంటుంటారు. నిజానికి.. పరిస్థితులు అన్నీ సానుకూలంగా ఉన్నప్పుడే ఒక్కోసారి పేషెంట్కు అవసరమైన రక్తం దొరకదు. ఇప్పుడిక ఏకంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని పలువురు విశ్లేషకులు అంటున్నారు. లాక్డౌన్ మొదటి రోజునే బ్లడ్బ్యాంకుల్లో కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీ వరకు పరిస్థితులు మరింత సంక్లిష్లంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి, రక్తదాన శిబిరాల నిర్వహణకు అనుకూలమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.