బీజేపీకి పాత మిత్ర పక్షం శివసేన మరోసారి చురకలు వేసింది. అది కూడా అయోధ్య రాముడి సాక్షిగా హాట్ కామెంట్స్ చేసింది. మహారాష్ట్రలో శివసేన- కాంగ్రెస్- ఎన్సీపీ కూటమి అధికారం చేపట్టి వంద రోజులు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్నారు. కుమారుడు ఆదిత్య ఠాక్రేతో కలిసి అయోధ్యకు ఆయన వచ్చారు.
అయోధ్యలో ఆయనకు మర్యాదలు బాగానే జరిగాయి. అయోధ్యలో యూపీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఉద్ధవ్....అనంతరం రామ మందిరాన్ని దర్శించుకున్నారు. సీఎం ఉద్ధవ్కు శివసేన నేత సంజయ్ రౌత్, ఆ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆలయాన్ని సందర్శించుకున్న తర్వాత సీఎం ఉధ్దవ్ ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అయోధ్య విషయంలో తమ వైఖరిలో ఏమాత్రం మార్పు లేదని శివసేన సీఎం ఉద్దవ్ ఠాక్రే స్పష్టం చేశారు. అంతే కాదు.. శివసేన పార్టీ పత్రిక సామ్నాలోనూ ఈ అంశంపై ఘాటుగా వ్యాఖ్యానాలు వచ్చాయి. శ్రీరాముడు, హిందుత్వ ఏ ఒక్క పార్టీ సొత్తు కాదని శివసేన విమర్శించింది.
శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అధికారం చేపట్టినప్పుడు.. ఈ కూటమి ఎంతో కాలం కొనసాగదని బీజేపీ నేతలు అన్నారు. ఇప్పుడు ఈ అంశాన్ని శివసేన ప్రస్తావిస్తోంది. తమ ప్రభుత్వం వంద గంటలు కొనసాగదని గతంలో చేసిన విమర్శలను గుర్తు చేస్తూ... తమ సర్కారు వంద రోజులు పూర్తి చేసుకుందని శివసేన గుర్తు చేస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: