ఈ గెలుపు కోసం ఎంత ఖర్చు పెట్టామో తెలుసా... కేసీఆర్ చెప్పిన లెక్కలు
తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 120 మున్సిపాలిటీలకు 100కు పైగా స్థానాల్లో విజయదుందుభి మోగించిన టీఆర్ఎస్ పార్టీ నేతలు సంబురాలు జరుపుకొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయ సందడి సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు. గెలుపుకోసం తాము అడ్డదారులు తొక్కామని అంటున్నారని అయితే, తాము డబ్బులు, విధానాల్లో సరైన విధానంలో ముందుకు వెళ్లామని కేసీఆర్ స్పష్టం చేశారు.
తాము అధికార దుర్వినియోగం చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తాను ఒక్క అధికారి, డీజీపీ, పోలీసులు సహా ఎవరితో మాట్లాడలేదని స్పష్టం చేశారు. నిధుల దుర్వినియోగం చేయలేదని, కేవలం రు.80 లక్షలు మెటీరియల్ మాత్రమే పంపామని కేసీఆర్ తెలిపారు. ``మేం ఒక్క రూపాయి కూడా పంచలేదు. విపక్షాలు ఆరోపణలు ఇంత విజయం తెచ్చిన తెలంగాణ సమాజాన్ని అవమానించడమే... కాంగ్రెస్, బీజేపీ గెలిచిన చోట్ల కూడా వాళ్లు డబ్బులు పంచారా ? ఏ పార్టీలో అయినా బలిసినోళ్లు ఖర్చు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు.. మేం మెటీరియల్ తప్పా ఒక్క రూపాయి కూడా పంచలేదు... వీళ్ల పిచ్చి కూతలు కూడా ప్రజలు పట్టించుకోలేదు`` అని వ్యాఖ్యానించారు.
కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్- భారతీయ జనతా పార్టీలు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాయి. ఎంఐఎం పార్టీ భైంసా, జల్ పల్లి మున్సిపాలిటీల్లో గెలిచింది. తుక్కుగూడ, ఆమన్గల్ మున్సిపాలిటీల్లో భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ నాలుగు మున్సిపాలిటీల్లో గెలువగా.. మరో రెండు మున్సిపాలిటీల్లో ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ గెలిచింది. కాగా, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారథ్యంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ద్వారా టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలే బరిలో దిగారు. నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో జూపల్లి వర్గం విజయం సాధించడంతో టీఆర్ఎస్ బీఫాంతో బరిలో దిగిన నేతలు షాక్ ఓటమి పాలయ్యారు.