ఆడబిడ్డ శవాన్ని అమెరికా నుంచి తేవాలి.... డబ్బులు సహాయం చేయండి
అమెరికాలో తెలుగు ఆడబిడ్డ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అమెరికాలోని మిషిగన్లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్లోని నేరేడ్మెట్ రేణుకానగర్కు చెందిన యువతి చరితారెడ్డి (25) మృతిచెందారు. శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చరితారెడ్డి బ్రెయిన్డెడ్ అయినట్టు అక్కడి వైద్యులు వెల్లడించారు. చరితారెడ్డి రెండేళ్ల క్రితమే తన అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఆమె కిడ్నీలు, లివర్, కళ్లు దానం చేసి ఆమె అవయవాలను దవాఖానకు ఇచ్చారు.
తాను మరణిస్తూ అవయవదానం ద్వారా 9 మంది జీవితాల్లో వెలుగులు నింపిన చరితారెడ్డి మృతదేహం తరలింపులో ఇప్పుడు పెద్ద మనసు ఉన్న వారి సహాయం అవసరం పడింది. ఆమె డెడ్బాడీని హైదరాబాద్ తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మృతదేహాన్ని తరలించడం ఖర్చుతో కూడుకున్న విషయం కావడంతో చరితారెడ్డి స్నేహితులు క్రౌడ్ ఫడింగ్ ప్రారంభించారు. ఫేస్బుక్ ద్వారా ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కోరారు. బుధవారం సాయంకాలానికి కావాల్సిన అమౌంట్ సరికూరాయాని ఆమె మిత్రులు తెలిపారు.
కాగా, చరితారెడ్డి నాలుగేళ్ల క్రితమే అమెరికాలోని మిషిగన్కు వెళ్లారు. అక్కడే ఎంఎస్ పూర్తిచేశారు. ఎంఎస్ తర్వాత డెలాయిట్లో ఉద్యోగం రావడంతో అక్కడే స్థిరపడ్డారు. వారాంతం వెకేషన్ కోసం చరితారెడ్డి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో మిచిగాన్ నుంచి సిటీ బయటి ప్రాంతానికి వెళ్తున్నారు. మిషిగాన్లోని క్రాకెర్రి టౌన్షిప్ వద్ద డ్రైవర్ మారేందుకు కారు ఆపారు. పార్కింగ్ లైట్లు కూడా వేశారు. కారు వెనుక సీటులో చరితారెడ్డితోపాటు మరో స్నేహితురాలు, ముందు సీటులో ఇద్దరు కూర్చున్నారు. అదే సమయంలో వెనుక నుంచి కారులో మద్యం మత్తులో 140 కిలోమీటర్ల వేగంతో వచ్చి వీరి కారును ఢీకొట్టాడు. కారు వెనుక సీటులో కూర్చున్న చరితారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమె స్నేహితులు ఆస్పత్రిలో తీసుకెళ్లారు. బ్రెయిన్డెడ్ అయినట్టు వైద్యులు చెప్పారు. అన్ని ప్రక్రియలు పూర్తిచేసేందుకు మరో రెండురోజుల సమయం పడుతుందని, మరో నాలుగురోజుల్లో మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.