కేసీఆర్ కీలక ఆదేశం... తేడా రావద్దంటూ... వాళ్లకు క్లారిటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన టీమ్కు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ఆర్థికశాఖ 2020-2021వ ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనకు కసరత్తు మొదలుపెట్టిన సీఎం కేసీఆర్ ఈ మేరకు తగు సూచనలు చేశారు. బడ్జెట్ పకడ్బందీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) చివరినాటికి రాబడులు పెరుగుతాయా లేక తగ్గుతాయా? అది ఎంతమేరకు ఉంటుంది? వృద్ధిరేటులో ఎంత తేడా ఉంటుంది? కేంద్ర పన్నుల వాటాలో ఎంత తగ్గుదల ఉంటుంది? గ్రాంట్-ఇన్-ఎయిడ్లో ఎంత తేడా వస్తుంది? అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ ఏడాది లోక్సభ ఎన్నికలకు ముందు (ఫిబ్రవరిలో) కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్చి నెలలో ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్కు చట్టసభల ఆమోదం తీసుకుంది. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధంచేయనున్నారు. రాబడులు, ఖర్చులను పక్కాగా అంచనావేసి వాస్తవిక బడ్జెట్ను రూపొందించనున్నారు. భారీ అంచనాలకు పోకుండా అవసరమైన పనులకు మాత్రమే పక్కాగా ప్రతిపాదనలు పంపాలని రాష్ర్ట ఆర్థికశాఖ అన్ని శాఖల అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
వచ్చే నెల 7లోగా నూతన సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి ప్రాథమిక అంచనాలను పంపాలని ఆదేశించింది. అయితే, ఈ మేరకు పలు స్పష్టమైన సూచనలు చేసింది. ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) చివరినాటికి రాబడులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. గ్రాంట్-ఇన్-ఎయిడ్లో ఎంత తేడా వస్తుంది? కేంద్ర పన్నుల వాటాలో ఎంత తగ్గుదల ఉంటుంది? రాబడులు పెరుగుతాయా లేక తగ్గుతాయా? అది ఎంతమేరకు ఉంటుంది? వృద్ధిరేటులో ఎంత తేడా ఉంటుంది? వంటివి దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేసింది.