సీఎం సీటులో జగన్ ఐదేళ్లు మాత్రమే ఉండాలనుకుంటున్నారా?
ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించి నేటికి ఆరునెలలు పూర్తయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో అంతటి భారీ మెజార్టీతో, 50శాతానికి పైగా ఓట్లతో అధికారంలో రావడం ద్వారా సంచలన రికార్డు సృష్టించిన జగన్...ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆయన తన పాలనా తీరు ఎలా ఉండబోతుందో ప్రజలకు చెప్పేశారు. ఎన్నికల మేనిపెస్టోనే పరమ పవిత్ర గ్రంథంగా భావిస్తానని...ప్రచారా ఆర్భాటాల కంటే ఇచ్చిన హామీలకే తాను కట్టుబడి ఉంటానంటూ అప్పుడే ప్రకటించారు. జగన్ ఆ దిశగా నడుస్తున్నారా? ఆరు మాసాలు పూర్తయిన జగన్ పాలన ఐదేళ్లకే పరిమితం అయ్యేలా సాగుతోందా? అనే చర్చ సహజంగానే జరుగుతోంది.
కేవలం ఐదేళ్ళు పాలించి సరిపెట్టుకోవడం కాకుండా కనీసం పాతికేళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగాలన్న దూరదృష్టికనుగుణంగా అడుగులు వేస్తున్నారు. గతేడాది రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా అవినీతి ఇండెక్స్లో దేశంలో ఐదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ శుక్రవారం విడుదలైన తాజా జాబితాలో 13వ స్థానానికి చేరింది. అవినీతిలో పలు రాష్ట్రాల కంటే ఏపీ అతి తక్కువ స్థాయిలో ఉంది. ఈ రాష్ట్రంలో 50 శాతం మంది ఇప్పటికీ పనుల కోసం తాము అధికారులకు ముడుపులిస్తున్నట్లు ఈ అధ్యయనకారులకు వెల్లడించారు. అయితే గతేడాది ఇదే నవంబర్లో నిర్వహించిన సర్వేలో 89 శాతం మంది ఇలాంటి బదులిచ్చారు. ఈ ఏడాదిలో అవినీతి శాతం కొద్దిమేరకైనా తగ్గుముఖం పట్టడం ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం సాధించిన విజయంగానే పరిశీలకులు పరిగణి స్తున్నారు. ఈ ఆరుమాసాల్లో ఏ మంత్రి లేదా ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తలేదు. క్రిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు ఉద్యోగుల బదిలీలు జరిగాయి.
పోలీసులకు సంబంధించిన బదలీల్లో ఒకట్రెండు చోట్ల నగదు చేతులు మారిందన్న సమాచారం నిఘా వర్గాల్నుంచి అందగానే సదరు ఎమ్మెల్యేను పిలిచి జగన్ మందలించారు. తీసుకున్న ముడుపుల్ని తిరిగిచ్చేయాలంటూ ఆదేశించారు. దీంతో మిగిలిన ఎమ్మెల్యేలు, ఒకరకరమైన భయమేర్పడింది. అలాగే భవిష్యత్ పట్ల భద్రత కూడా పెరిగింది. సక్రమంగా పని చేస్తే ఈ ఐదేళ్ళే కాదు...మరో రెండుమూడుసార్లైనా తాము తిరిగి జగన్తో కలసి అసెంబ్లీలోకి అడుగు పెడతామన్న ధీమా నెలకొంది. దీంతో తాత్కాలిక ప్రయోజనాల్ని పక్కనపెట్టి దీర్ఘకాలిక రాజకీయ భవిష్యత్ కోసం ప్రజాప్రతినిధులు తాపత్రయపడ్డం కనిపిస్తోంది. జగన్ ఆరు నెలల పాలనపై రాజకీయ విశ్లేషణలు సంతృప్తే వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు రాజకీయ, పరిపాలన సంస్కరణలు చేపడుతున్నారని అంటున్నారు.