పాపం జూనియర్ ఎన్టీఆర్ ను ఇప్పుడు తెలుగుదేశం రాజకీయాలకు బలిఅవుతున్నారు. 2009 ఎన్నికల సమయంలో తన కెరీర్ ను కూడా పక్కన పెట్టి అడిగారు కదా అని సొంత పార్టీగా భావించి, తన ప్రతిభతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేసి ప్రచారం చేశారు. రోడ్డు యాక్సిడెంట్ లో దెబ్బలు కూడా తిన్నాడు. ఎన్నికలు ముగిసిన తరువాత ఎన్టీఆర్ ను పక్కన పెట్టారు. ఇలా పక్కన పెట్టడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అన్నది తెలియడం లేదు.
ఎన్నికల తరువాత ఎన్టీఆర్ గురించి పెద్దగా పట్టించుకోలేదు చంద్రబాబు అండ్ కో. 2014 ఎన్నికల్లో లోకేష్ ను తెరపైకి తీసుకొచ్చారు. లోకేష్ కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చి మంత్రిని చేశారు. లోకేష్ ఏదో చేస్తాడని బాబుగారు ఊహిస్తే.. ఒకటి మాట్లాడాల్సిన చోట మరొకటి మాట్లాడి.. పార్టీ పరువును బజారుకు ఈడ్చాడు. 2014 ఎన్నికల సమయంలో లోకేష్ బాబు చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంగళగిరి, డెంగ్యూ మాటలను ఎలా మాట్లాడాడో తెలిసిందే.
ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకొస్తే.. తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబు హవా తగ్గిపోతుందేమో అనే భయంతోనే ఎన్టీఆర్ ను దూరంగా ఉంచుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వల్లభనేని బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేసిన తరువాత ఎన్టీఆర్ పేరు బయటకు వచ్చింది. ఎన్టీఆర్ ను 2009 ఎన్నికల్లో వాడుకొని వదిలేశారని మరోసారి విమర్శించడంతో తెలుగుదేశం రాజకీయాల్లోకి మరలా ఎన్టీఆర్ పేరు వచ్చింది.
అటు నాని కూడా ఎన్టీఆర్ గురించి మాట్లాడటంతో తెలుగుదేశం పార్టీ డైలమాలో పడింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ అవసరం లేదని, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఒక్కడు చాలు అని ఆ పార్టీ నేత వార్ల రామయ్య చెప్పడం విశేషం. వార్ల రామయ్య చెప్పిన విషయాలను బట్టి చూస్తే.. ఎన్టీఆర్ ను ఎందుకు దూరంగా పెడుతున్నారో అర్ధం అవుతున్నది. రాజకీయం అంటే ఇంతేకదా మరి.