ఎక్కువగా రైల్లో ప్రయాణించేవారికి కాస్త చేదు వార్తను రైల్వే బోర్డు చెబుతుంది. అదేమంటే రాజధాని, శతాబ్ధి, దురంతో ఎక్స్ప్రెస్ ట్రైన్లలో టీ, టిఫిన్, భోజనం రేట్లను పెంచుతున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. తాజాగా ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ స్టాక్ఎక్స్చేంజీలకు కూడా తెలియజేసింది.
ఇకపోతే నవంబర్ 14న రైల్వే మంత్రిత్వ శాఖ కేటరింగ్ సర్వీసెస్ మెనూ, టారిఫ్లను సవరించిన విషయం తెలిసిందే. దీంతో రాజధాని, శతాబ్ది, దురంటో ఎక్స్ప్రెస్ ట్రైన్లలో ప్రిపెయిడ్ మీల్స్ ధర పెరగనుందని రైల్వే బోర్డు డైరెక్టర్ తెలిపారు. అంతే కాకుండా ఇండియన్ రైల్వేస్ స్టాండర్డ్ మీల్స్ కూడా కొత్త ధరలే వర్తిస్తాయని ఐఆర్సీటీసీ తెలిపింది.
ఇక 15 రోజుల అనంతరం ఈ రేట్లను ట్రైన్ ప్యాసింజర్లకు అందుబాటులో ఉంచుతామని రైల్వే ఇటికెటింగ్ ప్లాట్ఫామ్ ఐఆర్సీటీసీ తెలిపింది. ఇకపోతే పెంచిన రేట్లు సర్క్యూలర్ జారీ చేసిన తేదీ నాటి నుంచి 120 రోజుల తర్వాత అమలులోకి వస్తాయని పేర్కొంది. ఇక ఫస్ట్ క్లాస్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్లలో టీ ధర రూ.15 నుంచి రూ.35కి, బ్రేక్ఫాస్ట్ ధర రూ.90 నుంచి రూ.140కి, లంచ్, డిన్నర్ ధరలు రూ.140 నుంచి రూ.245కి పెరగనున్నాయి.
సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీ, చైర్ కార్లలో ఉదయం టీ ధర రూ.10 నుంచి రూ.20కి, సాయంత్రం టీ ధర రూ.45 నుంచి రూ.90కి, బ్రేక్ఫాస్ట్ ధర రూ.70 నుంచి రూ.105కి, లంచ్, డిన్నర్ ధరలు రూ.120 నుంచి రూ.185కి పెరగనున్నాయి. ఇకపోతే రైళ్లలో మీల్స్ ధరలు పెరిగిన నేపథ్యంలో శతాబ్ది, రాజధాని, దురంతో టికెట్ ధరలలో సైతం స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. వీటిల్లో ప్రయాణించే వారు మీల్స్ను ఎంపిక చేసుకున్న నేపథ్యంలో వారి టికెట్ ధరలపై 3 నుంచి 9 శాతం వరకు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు..