ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటోంది. ఎప్పుడూలేని విధంగా ఇప్పుడు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధమైన విషయాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతినడంతో పాక్, ఇండియాపై ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ దాడులకు పాల్పడుతోంది. పాక్ ఉగ్రవాదానికి అడ్డా అనే విషయం ప్రపంచం ఇప్పటికే గుర్తించింది. ప్రపంచం నిషేదించిన 148సంస్థలు, ఉగ్రవాదులు పాక్ దేశంలోనే ఉన్నారు. ఇది జగమెరిగిన సత్యం.
పాక్ ఉగ్రవాదంపై నిజమైన పోరు చేసి, ఉగ్రవాద మూలాన్ని తుదముట్టించాలని లేదంటే ఎఫ్ఏటిఎఫ్ ఆ దేశాన్ని బ్లాక్ లిస్టులో పెడుతుందని ఆ సంస్థ హెచ్చరించింది. ఫిబ్రవరి వరకు గడువు ఇచ్చింది. ప్రస్తుతం గ్రే లిస్టులో ఉన్నది. దీనికి కారణం ఇండియానే అని, ఇండియా తన మార్కెట్ పరిధిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచదేశాలతో పాక్ పై కుట్ర చేయిస్తోందని ఆరోపిస్తోంది. పాక్ చేస్తున్న ఆరోపణలను ఎవరూ పట్టించుకోవడం లేదు.
అయితే, ఇండియాతో దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయని ఆ దేశం పదేపదే చెప్తున్నది. దీంతో పాక్ దేశానికీ ఇండియా ఓ బంపర్ అఫర్ ఇచ్చింది. పాక్ లో ఉన్న కరడుగట్టిన ఉగ్రవాదులైన మసూద్, హాఫిజ్, దావుద్ లను ఇండియాకు అప్పగించాలని, అలా అప్పగిస్తే.. పాక్ తో దౌత్యం తిరిగి కొనసాగిస్తామని, పాక్ ను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఇండియా విదేశాంగ శాఖామంత్రి జైశంకర్ పేర్కొన్నారు.
ఉగ్రవాదులను అప్పగిస్తే.. తమ దేశం నుంచి పాక్ తో అన్ని రకాలుగా చర్చలు జరుపుతామని అంటున్నారు. తాము ఎప్పుడు సిద్దంగానే ఉంటామని, కానీ, పాక్ నుంచి ఎలాంటి స్పందన ఉండటం లేదని అంటున్నారు. పాక్ ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉంటె.. పాక్ తో చర్చలు జరిపేందుకుగాని, పాక్ తో అన్ని రకాలుగా సహకరించేందుకుగాని సిద్ధంగా ఉన్నామని అంటోంది. ఆర్ధికంగా కూడా పాక్ ను ఆదుకుంటామని ఇండియా చెప్తున్నది.