భారత సర్వోన్నత న్యాయస్థానం సీజేఐ రంజన్ గొగోయ్ తన కెరీర్లో అనేక ప్రత్యేకతలను నమోదు చేసుకుంటున్నారు. ఓ వైపు పదవీ విరమణ సమయం దగ్గర పడుతున్నప్పటికీ...మరోవైపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ సంచలన అంశాలపై తీర్పులు ఇస్తున్నారు. కీలకమైన భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ యాక్ట్) తెస్తూ తీర్పును వెలువరించడం, దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అయోధ్య అంశానికి ముగింపు పలకడం వంటివి గొగోయ్ నాయకత్వంలో జరిగినవే. దీంతోపాటుగా ఆయన పలు ప్రత్యేకతలను నమోదు చేసుకున్నారు.
ఈశాన్యం నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి సీజేఐగా గగోయ్ చరిత్ర సృష్టించారు. జస్టిస్ దీపక్ మిశ్రా నుంచి గొగోయ్ బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ న్యాయవాది అయిన గొగోయ్ 13నెలల పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. అస్సాం మాజీ ముఖ్యమంత్రి కేశవ్ చంద్ర గొగోయ్ తన కొడుకు ఏదో ఒక రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతాడని ఓ సందర్భంలో చెప్పారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయి.
అస్సాం మాజీ ముఖ్యమంత్రి కేశవ్ చంద్ర గొగోయ్ కుమారుడైన రంజన్ గొగోయ్ దిబ్రూగఢ్లో 1954 నవంబర్ 18వ తేదీన జన్మించారు. ఢిల్లీ వర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించారు. 1978లో బార్ అసోసియేషన్లో చేరారు. 1978లో న్యాయవాదిగా చేరి గువాహటి హైకోర్టులో ఎక్కువ కాలం పనిచేశారు. 2001 ఫిబ్రవరి 28న గువాహటి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 సెప్టెంబర్ 9న పంజాబ్ - హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2011 ఫిబ్రవరి 12న ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2012 ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సీజేఐ రంజన్ గొగొయ్ నవంబర్ 17వ తేదీన పదవీ విరమణ పొందనున్న విషయం తెలిసిందే.