నాయకులు సమష్టిగా ఉంటేనే ప్రజలు ఆదరిస్తారో.. ఆదరించరో తెలియని రాజకీయ పరిస్థితులు నేడు రాజ్యమేలుతున్నాయి. అలాంటిది ఎవరికి వారే యమునా తీరే.. అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తే.. ఇక, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? పార్టీ ఎక్కడ అభివృద్ధి బాట పడుతుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ కూడా టీడీపీని వేధిస్తున్నాయి. దీనికి కారణం.. కీలమైన నాయకుడు, ఉద్ధండులు ఉన్న జిల్లాల్లో కూడా పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి లేకపోవడమే. తాజాగా చంద్రబాబు ఇటీవల ఎదురైన ఓటమి నుంచి తేరుకుని.. పార్టీకి ఆయిల్ పెట్టే పని చేపట్టారు.
ఈ క్రమంలోనే జిల్లాల వారీగా సమీక్షలు చేస్తూ.. నాయకులకు భరోసా కల్పిస్తున్నారు. అయితే,ఏజన్సీ ప్రాంతమైన అరకు పార్లమెంటు పరిధిలో టీడీపీ పరిస్తితి ఎలా ఉందంటే.. బాబు ఊహకు కూడా అందని విధంగా ఇక్కడ పార్టీ పరిస్తితి సన్నగిల్లింది. నిజానికి ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు ఏర్పడింది కాదు. అధి కారంలోకి వచ్చిన 2014లోనే టీడీపీ పరిస్థితి అరకు పార్లమెంటు పరిధిలో దారుణంగా ఉంది. 2014 ఎన్ని కల్లో ఈ పార్లమెంటు పరిధిలో వైసీపీ విజయదుందిభి మోగించింది. అధికారంలోకి టీడీపీ వచ్చినా.. ఇక్కడ మాత్రం అత్తెసరుకు పడిపోయింది. కేవలం ఒకే ఒక్కస్థానంలోనే పార్వతీపురంలోటీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది.
వాస్తవానికి అరకు పార్లమెంట్ పరిధిలో విశాఖ జిల్లాకు చెందిన పాడేరు, అరకు.. తూర్పుగోదావరికి చెంది న రంపచోడవరం...విజయనగరం జిల్లాకు చెందిన పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు అసెం బ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవన్నీ ఎస్సీ, ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గాలు. ఇక్కడ గిరిజనులదే పైచేయి. ఆది నుంచి కూడా వీరు కాంగ్రెస్కు మద్దతుగా ఉన్నారు. వైఎస్ హయాంలో ఇక్కడ రోడ్లు, 108, ఆరోగ్య శ్రీ వంటివి బాగా అమలు చేశారు.
పింఛన్లను ఎక్కువగా రాయించారు. దీంతో ఇక్కడి గిరిజనులు వైఎస్కు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఆయన మరణంతో ఆయన కుమారుడు జగన్ పెట్టిన పార్టీ వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో అరకు ఎంపీతో సహ ఆరు స్థానాల్లో వైసీపీనే గెలిచింది. ఒక పార్వతిపురం లోనే టీడీపీ గెలిచింది.ఇక, ఈ ఏడాది ఏప్రిల్ ఎన్నికల్లో మొత్తం వైసీపీనే క్లీన్ స్వీప్ చేసింది. అరకు అసెంబ్లీలో టీడీపీ(కిడారి శ్రావణ్ కుమార్) డిపాజిట్ కూడా కోల్పోయింది. దీని బట్టి చూసుకుంటే ఇక్కడ వైసీపీకి వంద ఏనుగుల బలం ఉన్నదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.
అలాంటి చోట టీడీపీ ఎంతో కష్టపడాలి. కానీ ఇక్కడ టీడీపీ నేతలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్నారు. పార్టీని ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఇక, ఈ విషయం తెలిసిన బాబు కూడా ఈ ఏజెన్సీ పార్లమెంటు నియోజకవర్గంపై ఆయన కూడా ఆశలు వదిలేసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సో.. ఇదీ అరకులో టీడీపీ అవస్థలు!!