జగన్ - 151 రోజులు : జనం మెచ్చని అంశాలివే..!
జగన్ సీఎంగా 151 రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. జగన్ పాలననలో 70 శాతం అంశాలను జనం మెచ్చగా.. మరో 30 శాతం అంశాల్లో మార్పు కోరుతున్నారు. అవినీతి, పైరవీలకు తావు లేని ఇసుక విధానం అని, ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇసుక ఇంటికి చేరుతుందన్న ప్రభుత్వ ప్రకటనలో వాస్తవం లేదని అంటున్నారు. అందరికీ ఇసుకను అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని భవననిర్మాణ కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ జగన్ పాలనలోకి వచ్చినప్పటి నుండీ విద్యుత్ కోతలు అధికమయ్యాయంటున్నారు జనం. వానా కాలంలోనే ఇలా ఉంటే వేసవిలో ఎలా ఉంటుందో అంటున్నారు. ఉద్యోగాలు, బదిలీల విషయాల్లో ప్రజా ప్రతినిధుల జోక్యం పతాక స్థాయికి చేరిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీల విషయంలోనూ కొందరు ప్రజాప్రతినిధులు మండల, డివిజన్ స్థాయిల్లో హవా సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
జగన్ పాలనలో లోపాలను ఎత్తి చూపి నిర్మాణాత్మక విమర్శలు చేయకుండా,ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత కేవలం విష ప్రచారం చేస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి జగన్ హుందాగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఎక్కడా ప్రతిపక్షం చేసే పిచ్చి ఆరోపణలు, విమర్శలను ప్రస్తావించడం లేదు. ప్రతిపక్షనాయకులు రెచ్చగొట్టేలా ఎన్ని విమర్శలు చేస్తున్నా, అసలు చంద్రబాబు,పవన్ల ఊసే ఎత్తడం లేదు.
నిశ్శబ్దంగా తాను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే పనిలో నిమగ్నమవుతూ, పరిణితితో వ్యవహరిస్తూ, ముందుకు పోతున్న జగన్ పట్ల అన్ని వర్గాల్లోనూ హర్షం వ్యక్తం అవుతోంది. ఇసుక విషయంలో కట్టడి చేసి, బెల్ట్ షాపులు మూసేసి, వైన్ షాపులు తగ్గించేస్తూ, రికమెండేషన్లు పట్టించుకోకుండా ముందుకు సాగుతుంటే, జగన్ పాలన కొందరికి రుచించడం లేదు. జగన్ మాత్రం క్లీన్ గవర్నమెంట్ను నడపాలని చూస్తున్నారు. విద్యుత్ కోతలు, ఇసుక కొరత నుండి ప్రజలకు విముక్తి కలిగించాల్సిన అవసరం ఉంది.