మెట్రోలో ప్రయాణం అంటే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. వరుసగా ఏదొక ప్రమాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న వర్షం పడుతుందని హైదరాబాద్ లోని అమీర్ పెట్ మెట్రో స్టేషన్ కింద తలదాచుకున్న ప్రయాణికురాలి తలపై మెట్రో స్టేషన్లో పిల్లర్ పెచ్చు ఊడిపడి క్షణాల్లో ఆమె ప్రాణాలను తీసేసింది.
తాజాగా ఇప్పుడు మరో ఘటన జరిగింది. అదృష్టం బాగుండి ఆ మెట్రో ప్రయాణికురాలికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన బెంగుళూరులోని ఓ మెట్రో స్టేషన్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నలుగురు ప్రయాణికులు స్టేషన్లోని ఆటోమెటిక్ ఫేర్ కలేక్షన్ గేటు వద్దకు రాగానే వారికి కొద్ది అడుగుల దూరంలో ఫాల్స్ సీలింగ్ నుంచి రెండు ప్యానల్లు ఊడిపడటంతో ఆందోళన చెందారు. కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
బెంగళూరులోని ‘నమ్మా మెట్రోస్ నేషనల్ కాలేజీ’ దగ్గరి మెట్రో స్టేషన్లో సెప్టెంబర్ 30న ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫుటేజీలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
స్టేషన్ సైడ్ వాల్స్ లీకై గోడల నుంచి స్లాబ్లు పడిపోయిన ఘటనలు ఇంతకు ముందు కూడా చాలా జరిగాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరలోనే గోడలకు ప్లాస్టింగ్ చేస్తామని బెంగళూరు మెట్రో రైలు కార్పోరేషన్(బీఎమ్ఆర్సీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ అజయ్సేత్ పేర్కొన్నారు. ఏది ఏమైనా మెట్రోలో ప్రయాణించాలంటే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.