తెలంగాణ కాంగ్రెస్కు ఇంకో ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి మరో ఊహించని షాక్ తగలనుందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. గత ఏడాది జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ ఫిరాయించగా...మరో ఎమ్మెల్యే అదే దారిలో ఉన్నారని తెలుస్తోంది. ములుగు ఎమ్మెల్యే సీతక్క పార్టీ మారనున్నట్లు టాక్ తెరమీదకు వస్తోంది.
సీతక్క నక్సలైట్ ఉద్యమ బాట నుంచి రాజకీయం వైపు అడుగులు వేశారు. తెలుగు దేశం పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. అనతి కాలంలోనే ఆ పార్టీలో రాష్ట్ర స్ధాయి మహిళా నేతగా పేరు సంపాదించుకున్నారు. తొలిసారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, రాజకీయ దిగ్గజం అజ్మీర చందులాల్ పై విజయం సాధించారు. 2014ఎన్నికల్లో రెండో సారి చందులాల్తో తలపడిన సీతక్క, ఓటమి పాలయ్యారు. సీన్ కట్ చేస్తే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా, రేవంత్తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముచ్చటగా మూడోసారి బరిలో దిగిన అనసూయ, ముందస్తు ఎన్నికల్లో మాజీ మంత్రి చందులాల్ పై విజయం సాధించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలుపొందింది. సీతక్కతో పాటు భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి గెలిచారు. అయితే, టీఆర్ఎస్ ఆపరేషన్కు ఆకర్శితులైన గండ్ర టీఆర్ఎస్లో చేరారు. అదే సమయంలో, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ములుగును జిల్లా కేంద్రంగా ప్రకటించింది. అయితే, సీతక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండడంతో, ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదట. ఈనేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆమె పెద్దగా ఆసక్తి కనబర్చలేదని తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ వర్గాలు- సీతక్క మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం.