రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే.. చాలా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈ దఫా ప్రజల్లో అనూహ్య మైన మార్పు కనిపించిందని అంటున్నారు. ఆది నుంచి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు.. అభివృద్ది నినాదంతో ముం దుకు సాగారు. ఇక, ఎన్నికల సమయానికి ఏకంగా పసుపు-కుంకుమ పేరుతో 94 లక్షల మంది డ్వాక్రా గ్రూపు మహిళలకు ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఖాతాల్లో వేశారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు అనూహ్యంగా మారాయి. అయితే, చంద్రబాబు వ్యూహం నిజంగానే ఫలించిందా. పసుపు-కుంకుమ ప్రభావం ఓట్లు కురిపించిందా? అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం మే 23నే తేలనుంది.
అయితే, ఎన్నికల తర్వాత పలు ఆన్లైన్ చానెళ్లు నిర్వహించిన సర్వేలో మాత్రం ప్రజలు మార్పు కోరుకుంటున్నట్టు స్పష్టమైంది. ప్రధానంగా కృష్ణాజిల్లాలో విజయవాడకు సమీపంలోనే ఉండే ఓ నియోజకవర్గంలో ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకున్నారని ఈ సర్వేలు చాటుతున్నాయి. ప్రతి విషయానికి దూకుడుగా ఉండే ఇక్కడి టీడీపీ ఎమ్మెల్యే అనేక వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ముఖ్యంగా కాల్ మనీ విషయంలో ఆయన పేరు బాహాటంగానే వినిపించింది. ఇక, సొంత పార్టీలోనూ ఈయనపై పెద్దగా సానుభూతి కనిపించలేదు. ఈ నియోజకవర్గంలోని టీడీపీలోమూడు గ్రూపులు ఏర్పడి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేయడం ఈ ఎన్నికల్లో కాదనలేని నిజం.
ఇక, ఇక్కడ నుంచి వైసీపీ కూడా బలమైన అభ్యర్థి, మాజీ మంత్రిని నిలబెట్టింది. సానుకూలత ప్రధానాంశంగా ఆయన ప్రజలకు చేరువ అయ్యారు. పార్టీ కూడా ఏకతాటిపై నడిచింది. మరోపక్క,జగన్ పై ఇక్కడ ఆశావహులు పెద్దగానే కనిపించారు. కమ్మ ఓటింగ్తోపాటు.. మాస్ ఓటింగ్ కూడా ఇక్కడ అభ్యర్థిని నిర్ణయిస్తుంది. గత ఎన్నికల్లో వీరంతా కూడా టీడీపీకి అందగా నిలిచారు. అయితే, ఈ దఫా కమ్మ సామాజిక వర్గంలో భారీ మార్పు కనిపించింది. రెండు వర్గాలుగా చీలిపోయిన కమ్మ వర్గం టీడీపీకి, వైసీపీకి కూడా మద్దతు ప్రకటించడం గమనార్హం. ఇక, రైతాంగం కూడా ఇక్కడ వైసీపీకి అండగా నిలిచినట్టు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యేపై పాజిటివిటీ లేక పోవడం ప్రధానంగా టీడీపీని ఇక్కడ సందేహంలో పడేసింది. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను బట్టి.. స్థానిక ఎమ్మెల్యేకి ఎదురుగాలి భారీగానే వీస్తోందని అంటున్నారు.