ఆ నాయకుడి పరిస్థితి ఎవరికీ రాకూడదు..!
రాజకీయాల్లో ఎప్పడూ ఎవరి జీవితం ఎలా మలుపులు తీరుతుందో చెప్పడం కష్టం. ఒక పార్టీలో గెలిచినా నాయకులూ మరో పార్టీ లో కి జంప్ చేసి పదవులు పొందటం మామూలే. ఒకపుడు కాంగ్రెస్ లో రారాజుగా వెలిగిన ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్ ఇప్పుడు ప్రస్తుతం తెరాస రాజ్య సభ సభ్యుడు. డీఎస్పై నిజామాబాద్ ఎంపీ ఎంపీ కమ్ సీఎం కేసీఆర్ కూతురు కవిత కన్నెర్ర చేయడంతో ఆయనకు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే.
జిల్లాలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనపై అగ్గిమీద గుగ్గిలం కావడమే కాకుండా, చర్యలు తీసుకోవాలంటూ పార్టీ అధ్యక్షుడైన తండ్రికి లేఖ రాసిన రోజు నుంచి డీఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పూర్తిగా ఒంటరి అయిపోయాడు. పలకరించే దిక్కులేదు. తనగోడు చెప్పుకుందామని డీఎస్ ప్రయత్నిస్తున్నా కేసీఆర్ పట్టించుకోవడంలేదు. ఇప్పటివరకు అప్పాయింట్మెంట్ ఇవ్వలేదు. ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు.
డీఎస్ బీసీ వర్గానికి చెందిన నాయకుడు కావడంతో వేటు వేస్తే రాజకీయంగా ఇబ్బంది కలుగుతుందని సీఎం భావిస్తున్నారని సమాచారం. అప్పాయింట్ ఇవ్వకుండా, ఆయనతో ఏ నాయకుడిని మాట్లాడనివ్వకుండా అవమానించి ఒంటరిని చేస్తే తనకు తానే పార్టీ వదిలి వెళ్లిపోతాడని అనుకుంటున్నారు. ఈవిధంగా రాజకీయంగా కష్టాల్లో ఉన్న సమయంలోనే డీఎస్ కుమారుడు సంజయ్ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కొని తండ్రిని ఊబిలోకి మరింత లోతుగా దించేశాడు. తాను ఎలాంటి తప్పుచేయలేదని, కుట్ర జరిగిందని చెప్పిన సంజయ్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పటివరకు ఆచూకీ తెలియలేదు. నాలుగు పోలీసు బృందాలు ఏపీ, మహారాష్ట్ర ఇంకా ఇతర రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి.