మంత్రి నారాయణ ఖాతాలోకి వేల కోట్ల రూపాయలు వెళిపోతున్నట్లు బిజెపి ఆరోపించింది. బిజెసి ఎంఎల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, సర్వశిక్ష అభియాన్ కు కేంద్రం నుండి రూ. 3 వేల కోట్లు, రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన రూ. 30 వేల కోట్లలో రూ. 9 వేల కోట్లు చేతులు మారుతున్నట్లు మండిపడ్డారు. విద్యకు కేటాయించిన నిధులన్నీ మంత్రి నారాయణ పరమవుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా సర్వశిక్ష అభియాన్ లో పోస్టులను కూడా మంత్రి అమ్ముకుంటున్నట్లు ధ్వజమెత్తారు.
వేల కోట్ల అవినీతి
నాలుగేళ్ళుగా ఏపిలో సమర్ధవంతంగా అవినీతి పాలన జరుగుతోందంటూ ఎద్దేవాచేశారు.. అన్నీ రంగాల్లోనూ అవినీతిని పెంచి పోషిస్తున్నారట. అర్బన్ హౌసింగ్ స్కీంలో సుమారు రూ. 30 వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. అలాగే, మట్టి-నీరు పథకంలో కూడా మరో రూ. 30 వేల కోట్ల అవినీతి జరిగిందంటూ మండిపడ్డారు. ఇసుక తవ్వకాల ద్వారానే కాకుండా జన్మభూమి కమిటీల ద్వారా కూడా అవినీతి జరుగుతోందన్నారు.
ప్రాజెక్టులను కుదవపెడుతున్నారా ?
ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవటంతో జీవో నెంబర్ 51 ద్వారా పది ప్రాజెక్టులను కుదవపెట్టి రూ. 6500 కోట్లను తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు మండిపడ్డారు. కేంద్రపథకాలు రాష్ట్రప్రభుత్వ పెద్దలకు ఉపాధి హామీ పథకాలుగా మారిందంటూ ఎద్దేవా చేశారు. గ్రామాల్లో వేసే సిమెంట్ రోడ్లు, ఎల్ఇడిఇ బల్బులు, కడుతున్న ఇళ్ళు, ఇస్తున్న 24 గంటల కరెంటు, నీరు-చెట్టు తదితర పథకాలన్నీ కేంద్రప్రభుత్వ పథకాలతో నడుస్తున్నవే అంటూ మండిపడ్డారు.
మరి కేంద్రం ఏం చేస్తున్నట్లు ?
అస్తవ్యస్త పాలన వల్ల ఇప్పటికే రూ. 1.20 లక్షల కోట్ల అప్పుతెచ్చిన చంద్రబాబు మళ్ళీ భారీ మొత్తంలో అప్పు తేచ్చుకోవటానికి ప్రయత్నించటం దారుణమన్నారు. పాలనలో ఆర్దిక క్రమశిక్షణ తప్పుతుంటే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే, ఇక్కడే అందరిలోనూ ఒక సందేహం వస్తోంది. సోము వీర్రాజు ఆరోపిస్తున్నట్లు ఇంత భారీ స్ధాయిలో అవినీతి జరుగుతుంటే మరి ఇంత కాలం కేంద్రప్రభుత్వం ఏం చేస్తున్నట్లు ?