ఒకవైపు మహానాడు పండుగ జరుగుతుండగానే తెలంగాణ టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి చంద్రబాబునాయుడుపై పెద్ద బాంబే వేశారు. తీవ్ర ఆరోపణలు చేసి చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ ను పదవి నుండి దింపేయటం, ఎన్టీఆర్ కుటుంబాన్ని మోసం చేయటం, రాజ్యసభ టిక్కెట్లను అమ్ముకోవటం, ఓటుకునోటు కేసు లాంటి అనేక సున్నితమైన అంశాలపై మోత్కుపల్లి తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. పనిలో పనిగా ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మగాడని ప్రశంసిస్తూనే చంద్రబాబును దొంగ అనటం మహానాడులో సంచలనం రేకెత్తించింది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించిన తెలంగాణా టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
చంద్రబాబుతో పడటం లేదా ?
ఈ మధ్య మోత్కుపల్లికి చంద్రబాబుకు పడటం లేదులేండి. అందుకనే తెలంగాణాలో జరిగిన మహానాడుకు కూడా మోత్కుపల్లిని పిలవలేదు. అంటే టిడిపిలో సీనియర్ నేతకు నూకలు చెల్లినట్లే అన్నది అర్ధమైపోతోంది. రేపో మాపో టిఆర్ఎస్ లో చేరటం కూడా ఖాయమని సమాచారం. అందుకే ఎటూ పార్టీని వదిలేస్తున్నామన్న ధైర్యంతో చంద్రబాబుపై బహిరంగంగానే మీడియా ముఖంగా దు్మెత్తిపోశారు. మొత్తానికి మహానాడు సందర్భంగా విజయవాడలో పసుపు పండగ సంబరాల్లో ముణిగితేలుతున్న నేతలకు మోత్కుపల్లి వ్యాఖ్యలు, ఆరోపణలు ఒక్క సారిగా షాక్ కు గురిచేశాయనే చెప్పాలి.
టిడిపి జెండాను దొంగలించారు
ఎంతో మహోన్నత ఆశయాలతో అన్నగారు ఎన్టీఆర్ టిడిపిని ఏర్పాటు చేస్తే అటువంటి మహనీయునిపైనే కుట్రలు పన్నిన నీచుడు చంద్రబాబు అంటే మండిపడ్డారు. ఎన్టీఆర్ దగ్గర నుండి టిడిపి జెండాను చంద్రబాబు దొంగలించి ఎన్టీఆర్ మరణానికి కారకుడైనట్లు ధ్వజమెత్తారు. పార్టీ నచ్చకపోతే ఎవరైనా పార్టీ నుండి బయటకు వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టుకుంటారు కానీ ఎవరైనా పార్టీనే సొంతం చేసుకుంటారా అంటూ చంద్రబాబును నిలదీశారు. ఈ విషయంలో జగన్ మగాడంటూ ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీలో నుండి బయటకు వచ్చేసిన జగన్ సొంతంగా పార్టీని పెట్టుకున్న విషయాన్ని సీనియర్ నేత గుర్తుచేశారు.
కెసిఆర్ ప్రభుత్వంపై కుట్ర
ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసినట్లుగానే కెసిఆర్ ప్రభుత్వాన్ని కూలదోయాలని చంద్రబాబు కుట్రపన్నినట్లు మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఆ ప్రయత్నంలోనే ఓటుకునోటు కేసులో దొరికిపోయి హైదరాబాద్ నుండి విజయవాడకు పారిపోయారంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఓటుకునోటు కేసులో రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ ముద్దాయిలే అంటూ బల్లగుద్దిమరీ చెప్పారు. అవసరాల కోసం మాల-మాదిగల మధ్య చిచ్చు పెట్టిన చంద్రబాబు ఇపుడు కాపు-బిసిల మధ్య కూడా చిచ్చు పెడుతున్నట్లు ఆరోపించారు. చివరకు బ్రాహ్మణుల మధ్య కూడా చిచ్చురేపిన మేధావి చంద్రబాబంటూ దుమ్ముదులిపేశారు.
చంద్రబాబును ఓడించండి
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలంటూ మోత్కుపల్లి పిలుపివ్వటంపై పార్టీ మహానాడులో తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు టిడిపి ఎన్టీఆర్ కుటుంబానికి తిరిగి ఇచ్చేయాలని సలహా కూడా ఇచ్చారు. ఎన్టీఆ్ర కొడుకు హరికృష్ణతో పాటు కుటుంబం మొత్తాన్ని చంద్రబాబు మోసం చేశారని చెప్పిన మోత్కుపల్లి తక్షణమే చంద్రబాబు తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.