ఆమ్రపాలీ... ఏంటా నవ్వులాటలు..!?

Vasishta

ఆమ్రపాలి.. త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్న అందాల కలెక్టరమ్మ. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా ఉన్న ఆమ్రపాలికి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఆమె ఏం చేసినా సంచలనమే. కలెక్టర్ అయినా ఆమె చేసేవన్నీ టీనేజ్ పనులే.. అయితే ఆమె మరోసారి ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది.


          రిపబ్లిక్ డే ప్రసంగంలో ఆమ్రపాలి తడబడింది. మరుగుదొడ్లకు సంబంధించి లెక్కలు వివరిస్తున్న క్రమంలో ఆమె ఒక్కసారిగా నవ్వేసింది. అంతటితో ఆగకుండా ఇట్స్ ఫన్నీ అంటూ కామెంట్ కూడా చేసింది. దీంతో ఆ కార్యక్రమానికి హాజరైనవారంతా ఆశ్చర్యపోయారు. కలెక్టర్ హోదాలో ఉన్న ఆమె.. ఆ ప్రసంగాన్ని నవ్వులాటగా మార్చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఆమె ప్రసంగం వైరల్ గా మారింది.


          బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. తాము ఏం మాట్లాడుతున్నామో ఆలోచించుకోవాలి. పైగా వేలాదిమంది హాజరైన కార్యక్రమాల్లో కలెక్టర్ లాంటి వ్యక్తులు ఎంతో ఉన్నతంగా బిహేవ్ చేయాలి. కానీ ఆమ్రపాలి మాత్రం సిల్లీగా బిహేవ్ చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హోదాను మరిచి ఆమె బిహేవ్ చేసిందనే మాట సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.


          ఆమ్రపాలి నవ్వులాట వైరల్ గా మారుతుండడంతో ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆమెకు ఫోన్ చేసి వివరణ కోరారు. ఎందుకలా జరిగిందని ప్రశ్నించారు. అయితే పదాలు పలకడంలో ఇబ్బంది పడ్డానని ఆమ్రపాలి వివరణ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఎస్పీ సింగ్ శాంతించినట్టు సమాచారం. గతంలో కూడా ఆమ్రపాలి ఓసారి మంత్రి కేటీఆర్ ఆగ్రహం చవిచూశారు.


          ఆమ్రపాలి వచ్చే నెల 18న పెళ్లాడబోతున్నారు. జమ్ముకాశ్మీర్ కు చెందిన సమీర్ శర్మను ఆమె వివాహమాడనున్నారు. సమీర్ శర్మ ప్రస్తుతం డామన్ డయ్యూ ఎస్పీగా పనిచేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: