వైసీపీ అధినేత జగన్ పాదయాత్రపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత, చంద్రబాబు నిఘా పెట్టారా? జగన్ పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి ఆయన తెగ ఫీలై పోతున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా పాదయాత్రలో జగన్ చేస్తున్న ప్రసంగాలు, వీటికి ప్రజల నుంచి వస్తున్న స్పందన, పాదయాత్రలో ఎవరెవరు పాల్గొంటున్నారు? టీడీపీ నుంచి ఎవరైనా వస్తున్నారా? జగన్ను ఎవరైనా కలుస్తున్నారా? వంటి అనేక విషయాలను బాబు తన నిఘా నేత్రం ద్వారా తెలుసుకుంటున్నట్టు సమాచారం. ఈ నెల 6న ప్రారంభమైన జగన్ పాదయాత్రను అధికార టీడీపీ చాలా తక్కువగా అంచనా వేసింది.
నంద్యాలలో జగన్ పార్టీ ఘోర పరాజయం, కాకినాడ కార్పొరేషన్లో మట్టికరవడం వంటి కీలక అంశాల నేపథ్యంలో బాబు అండ్కోలు జగన్ను చాలా తక్కువగానే అంచనా వేశారు. జగన్ను ఎవరూ నమ్మరని, పాదయాత్రకు జనాలు ఉండరని, జగన్ ఏం చెప్పినా ఎవరూ పట్టించుకోరని అంటూ వచ్చారు. అయితే, అనూహ్యంగా పాదయాత్ర ప్రారంభించిన రోజు నుంచి జగన్ పాదయ్రతకు విశేష స్పందన వస్తోంది. ఎక్కడికక్కడ జనాలు తీవ్రస్థాయిలో స్పందిస్తూ.. జగన్ వెంట నడుస్తున్నారు. జై కొడుతున్నారు. వారి కష్టాలు చెప్పుకొంటున్నారు. ఈ సందర్భంగా నే జగన్ మాట్లాడుతూ.. బాబుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
దీంతో బాబులో ఒక్కసారిగా ఏదో తెలియని అలజడి ప్రారంభమైంది. దీంతో ఆయన పాదయాత్రలో అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే పోలీసు, నిఘా వ్యవస్థలను అప్రమత్తం చేసి, పాదయాత్రలో పాల్గొనే ప్రతి చీమ, దోమపైనా కూడా సమాచారం సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పుడు పాదయాత విధుల్లో పాల్గొంటున్న పోలీసులు తమ చొక్కాలకు కెమెరాలు ధరించి వస్తున్నారు. ప్రతి ఒక్కరి కదలికలను గుర్తిస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రతి రోజూ రాత్రి ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారని సమాచారం.
ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్రలో రోజూ రీజనల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఐవో నరహరి పాల్గొంటున్నారు. జగన్ వెళ్లే ప్రాంతానికి ముందుగానే చేరుకుని పరిస్థితులు పరిశీలిస్తున్నారు. ఆయన పరిశీలించిన అంశాలను పూసగుచ్చినట్టు బాబుకు పంపిస్తున్నారని సమాచారం. ప్రజలను తన వైపు తిప్పుకొనేందుకు జగన్ ఏయే అంశాలను లేవనెత్తుతున్నాడు? వంటి విషయాలపై కూడా బాబు దృష్టి పెట్టారట. పాదయాత్ర మొదటిరోజు కనిపించని నిఘా కెమెరాలు మూడో రోజు నుంచి పోలీసుల చొక్కాలకు వేలాడుతున్నాయి. మొత్తానికి ఈ పరిణామంతో బాబులోని పిరికితనం బయటపడుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.