ఇక కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమల్లోకి తీసుకొచ్చి ఈరోజుతో ఐదేళ్లు పూర్తైన విషయం తెలిసిందే.ఈ పన్ను విధానాన్ని ఇది సులభతరం చేసిందని కేంద్రం ఇప్పటికే ఎన్నోసార్లు స్పష్టం కూడా చేసింది. అయితే అటు ప్రతిపక్షాలు మాత్రం జీఎస్టీని తీసుకొచ్చినప్పటి నుంచి కూడా అనేక రకాల విమర్శలు చేస్తూనే ఉన్నాయి. కేంద్రం జీఎస్టీ పేరుతో సామాన్యులపై పన్ను భారం మోపిందని పైగా అదో సంస్కరణ అంటూ కూడా ప్రచారం చేసుకుంటోందని మండి పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ విమర్శల్లో ముందుంది. ఇప్పుడు జీఎస్టీకి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భాన్నీ భాజపాపై ఎన్నో విమర్శలు చేసేందుకు కరెక్ట్ టైమ్గా భావిస్తోంది హస్తం పార్టీ. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన రాహుల్ గాంధీ ఈ మాటల దాడిని మొదలు పెట్టారు కూడా. "గబ్బర్ సింగ్ ట్యాక్స్ కాస్తా గృహస్థీ సర్వనాశ్ ట్యాక్స్ (సామాన్య కుటుంబాలను ఇబ్బంది పెట్టే ట్యాక్స్) గా మారిపోయిందంటూ ఆయన ట్వీట్ చేశారు."ఇక ఆదాయంలో, ఉద్యోగాల కల్పన విషయంలో డౌన్ అయిపోతుంటే, ద్రవ్యోల్బణంలో మాత్రం చాలా టాప్లో ఉన్నాం" అంటూ మండిపడ్డారు. హోటల్ బస ఇంకా ఫుడ్ ఐటమ్స్పై ట్యాక్స్ పెంచటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజానికి ఈ జీఎస్టీకి గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని పేరు పెట్టింది రాహుల్ గాంధీయే. ఇక అప్పటి నుంచి ఇది బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఆయన మరోసారి కొత్త పేరు పెట్టి దీని గురించి ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా జీఎస్టీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వరుస ట్వీట్లతో ప్రధాని మోదీపై ఎన్నో సెటైర్లు వేసింది.అసలు ఈ జీఎస్టీ కారణంగా ఎవరూ లాభ పడలేదని, చిన్న వ్యాపారులు ఇంకా సామాన్యులు తీవ్రంగా నష్టపోయారని ట్వీట్ చేసింది. ముఖ్యంగా నిరుద్యోగం పెరగటానికి జీఎస్టీయే కారణమంటూ విమర్శించింది. ఇక అసలే ద్రవ్యోల్బణంతో దేశం సమస్యలు ఎదుర్కొంటుంటే కేంద్రం పలు వస్తువులపై జీఎస్టీ పెంచి దోచుకుందామని చూస్తోందని కూడా మండి పడింది.