ప్రియాంక వ్యూహం.. యూపీలో బీజేపీకి చెక్ పెట్టేనా..?
403 అసెంబ్లీ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్లో గెలిస్తే దాని ప్రభావం 2024 ఎన్నికలపై ఉంటుంది. అందుకే అక్కడ అధికారం నిలబెట్టుకోవడం కోసం బీజేపీ, తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. దేశంలో తిరిగి రాజకీయ పూర్వ వైభవం సొంతం చేసుకోవాలని చూస్తున్న కాంగ్రెస్కు ఉత్తరప్రదేశ్ ఎన్నికలే కీలకమని భావిస్తుంది. ఆ దిశగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా యూపీలోనే మకాం వేసి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించగా పార్టీ కార్యకర్తలను ఉత్సాహ పరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలో యూపీ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు ప్రియాంక గాంధీ వాద్రా. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోనప్పటికీ అధికారంలోకి వస్తామనే ధిమాను వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్లో ఎక్కువ సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. అలాంటి చరిత్రను మళ్లీ నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు పట్టుదలతో ఉన్నారు. 2017 ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. ఇప్పుడు సోలోగానే బరిలో నిలవాలని ప్రియాంక డిసైడ్ అయ్యారు. మరి ఈ నిర్ణయం ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.