ప్రస్తుతం అందరూ సినిమాలపై ఆసక్తి కన్నా డిజిటల్ వైపు అందరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పుడు తెలుగు టాప్ హీరోయిన్స్ సినిమాలకు దూరం అవుతున్నారా అంటే కాస్తా అటూ ఇటూగా అదే కనిపిస్తోంది. మన సౌత్ ఇండియా టాప్ హీరోయిన్స్ కాజల్, సమంత, అంజలి, సినీయర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఇలా అందరూ డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు.
ఇంకా వివరాల్లోకి వెళితే కాజల్ అగర్వాల్ తేజ దర్శకత్వం వహించిన 'లక్ష్మీ కళ్యాణం'తో తెలుగు సినిమాకు పరిచయమైనా క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ 'చందమామ' సినిమాతో తెలుగువారికి బాగా దగ్గరైంది. అయితే వరుసగా సినిమాలలో నటిస్తూ దాదాపు ఓ దశాబ్దం కాలంగా తెలుగువారిని తన అందచందాలతో అలరిస్తూనే వస్తోంది. తెలుగులో దాదాపు అందరీ హీరోలతో నటించింది ఈ భామ. అంతేకాకుండా స్టార్ హీరోయిన్గా కూడా గుర్తింపు పొంది ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. అయితే ప్రస్తుతం కాజల్కు సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. దీంతో కొత్త కొత్తగా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది.
కానీ ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడం దీనితో పాటు ఇంటర్నెట్ సేవలు కూడా అందరికి అనుకూల ధరల్లో ఉండడంతో ఇండియాలో డిజిటల్ మీడియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు ఇండియా బాట పడుతున్నాయి. అయితే అందులో భాగంగా ఇండియాలో ప్రస్తుతం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లు చాలా బాగా ప్రాచుర్యం పొందాయి. అంతేకాదు ఈ సంస్థలు సొంతంగా కాంటెంట్ను బాగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటినే మనం ఒరిజనల్స్గా అని పిలుస్తున్నాము.
ఈ ఒరిజనల్స్లో హిందీలో కియారా అద్వానీ నుండి రాధికా ఆప్టే వరకు వెబ్ సిరీస్లు చేస్తూ అటూ డిజిటల్లో ఇటూ సినిమాల్లో మంచి అవకాశాలు చాలా పొందుతున్నారు. తెలుగులో కూడా ఇలాంటీ కల్చర్ ఇప్పుడిప్పుడే మొదలయింది. ఆ మధ్య జగ్గుబాయ్ గా పిలిచే జగపతి బాబు అమెజాన్ వెబ్ సీరిస్లో అదరగొట్టిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఈ వెబ్ సిరీస్ చేయనున్నారు అని పూర్తి సమాచారం. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రుపొందిస్తున్న ఒక తమిళ వెబ్సిరీస్లో అందాల కాజల్ నటించేందుకు ఒప్పుకుందని తెలుస్తోంది. కాగా మొదట తమిళంలో తెరకెక్కనున్న ఈ వెబ్సిరీస్ ఆ తర్వాత తెలుగులోకి కూడా విడుదల కానుంది అని వార్తలు వస్తున్నాయి.