ఇండియన్ బుల్లితెర మీద ఇప్పుడు అంతా బిగ్ బాస్ మయమే నడుస్తోంది. ఎక్కడో నెదర్లాండ్లో ప్రారంభమైన ఈ షో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 400 ఛానెళ్లలో ప్రసారమవుతోంది. ఈ షో ఏ దేశంలో ఏ భాషలో ప్రసారమైనా హిట్ కొడుతూనే ఉంది. ఇక బాలీవుడ్లో గత పది సీజన్లుగా బిగ్ బాస్ షో సూపర్ హిట్ అవుతోంది. ఎన్నో కాంట్రవర్సీలకు ఈ షో కేరాఫ్ అయినా ప్రజల మన్ననలు మాత్రం పొందుతూనే ఉంది.
ఇదే క్రమంలో బిగ్ బాస్ షో సౌత్కు కూడా పాకింది. సౌత్లో ఇప్పటికే తమిళనాడులో ఈ షో ముందుగా స్టార్ట్ అయ్యింది. విశ్వనటుడు కమల్హాసన్ హోస్ట్గా వ్యవహరిస్తోన్న ఈ షో అక్కడ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. ముందుగా ఈ షోకు అక్కడ ప్లాప్ టాక్ వచ్చింది. అయితే వరుసగా వివాదాలు రావడం, అన్నాడీఎంకే మంత్రులు సైతం దీనిపై విమర్శలు చేయడం, కొందరు కమల్హాసన్ను టార్గెట్ చేయడంతో ఇప్పుడు ఈ షోకు అక్కడ మంచి క్రేజ్ వచ్చింది.
ఇక విజయ్ ఛానెల్లో ప్రసారమవుతోన్న ఈ షోకు వాళ్లు ఊహించిన దానికంటే ఎక్కువ టీఆర్పీ రేటింగ్లు రావడంతో వాళ్ల ఆనందానికి అవధులే లేవు. ఇక ఇప్పుడు ఈ షోకు మరింత ఎట్రాక్షన్ రానుంది. ఈ షో ముగింపు కార్యక్రమానికి సూపర్స్టార్ రజనీకాంత్ను ముఖ్య అతిథిగా తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారట.
రజనీ టీవీ ప్రసారాలకు, ప్రకటనలకు దూరంగా ఉంటారు. అయితే ఇప్పుడు ఈ షో కూడా వివాదాల్లో ఉంది. మరి ఈ షోకు రజనీ వెళ్లితే కొందరు పాజిటివ్గా స్పందించినా, మరికొందరు నెగిటివ్గా కూడా స్పందించే ఛాన్సులు ఉన్నాయి. అయితే తన మిత్రుడు కమల్ హోస్ట్ చేస్తోన్న షో కావడంతో కమల్ అడిగితే రజనీ ఈ షో ముగింపు కార్యక్రమానికి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.