ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ చిత్రాలపై సస్పెన్స్ వీడుతోంది. లాంగ్ గ్యాప్ అనంతరం గతంలో కమిట్ అయిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో పవన్ పడ్డారు. ఇటీవలె `హరి హర వీరమల్లు` షూటింగ్ ముగించారు. ఈ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ రెండు భాగాలుగా రాబోతోంది. ఫస్ట్ పార్ట్ ను జూన్ 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే మరోవైపు పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో రూపొందుతున్న `ఓజీ` షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇక సినిమానే ఉండదేమో అనుకున్న `ఉస్తాద్ భగత్ సింగ్` పై కూడా తాజాగా చిత్ర బృందం సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ కలిసి నిర్మిస్తున్నారు. శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్లుగా ఎంపిక అయ్యారు. పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ బిజీగా మారడంతో.. కొద్దిపాటి షూటింగ్ పూర్తి చేసుకున్నాక ఉస్తాద్ భగత్ సింగ్ నిలిచిపోయింది. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందంటూ కూడా ప్రచారం జరిగింది.
అయితే ఈ ప్రచారానికి పులిస్టాప్ పెడుతూ పవర్ స్టార్ ఫ్యాన్స్ను గుడ్న్యూస్ చెప్పింది చిత్రబృందం. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ రీస్టార్ట్ కాబోతోంది. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా.. `పవర్ స్టార్ బెస్ట్ ను సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధం అవ్వండి. హరీష్ శంకర్ డైరెక్ట్ చెయ్యబోయే ఉస్తాద్ భగత్ సింగ్ ఎన్నో ఏళ్ళు గుర్తుండిపోయే చిత్రం అవుతుంది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది` అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. `లెట్స్ బిగిన్ ది షో` అనే క్యాప్షన్ తో ఓ పోస్టర్ ను కూడా వదిలారు. ఈ పోస్టర్ లో దర్శకుడు హరీష్ శంకర్ చేతిని పట్టుకుని ఉన్న పవన్ కళ్యాణ్ ను చూపించారు. మొత్తానికి షూటింగ్ పునః ప్రారంభం కానుందని చిత్రయూనిట్ అనౌన్స్ చేయడంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇది కదా అసలైన ట్రీట్ అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, `గబ్బర్ సింగ్` వంటి బ్లాక్ బస్టర్ అనంతరం పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది. ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పర్చుకున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.