టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించిన హిట్ అంటే తెలియని హీరోయిన్స్...!!!

murali krishna
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణించడం అంత ఈజీ కాదు. ఏ కథానాయికకైనా అందం, అభినయం ఉంటే సరిపోదు. వాటితో పాటు కాసింత అదృష్టం కూడా కలిసి రావాలి.అప్పుడే కొంతకాలం స్టార్స్ గా వెలుగొందుతారు. ఇక్కడ సక్సస్ ఒక్కటే మాట్లాడుతుంది కాబట్టి, బ్యాక్ టూ బ్యాక్ రెండు ప్లాపులు పడితే మాత్రం ఎవరికైనా 'ఐరెన్ లెగ్' ముద్ర వేసేస్తారు. ఈ విధంగా టాలీవుడ్ లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ రుచి చూడని హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఎలాగోలా ఆఫర్స్ అందుకుంటున్నారు కానీ, ఆశించిన విజయాలు మాత్రం సాధించలేకపోతున్నారు. అలాంటి అందాల భామలెవరో ఇప్పుడు చూద్దాం. 'యాక్షన్ హీరో బిజు' అనే మలయాళ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన అను ఇమ్మాన్యుయేల్.. 'మజ్ను' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాని హీరోగా నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో అనుకి వరుస అవకాశాలు వచ్చాయి. కానీ విజయాలు మాత్రం వరించలేదు. 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'ఆక్సిజన్' లాంటి సినిమాలు తీవ్ర నిరాశ పరిచాయి. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నాగచైతన్య, రవితేజ, శర్వానంద్ లాంటి హీరోలతో నటించినా అమ్మడికి సక్సెస్ దక్కలేదు. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా, శైలజా రెడ్డి అల్లుడు, మహాసముద్రం, రావణాసుర వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పరాజయం చెందాయి. చివరగా వచ్చిన 'జపాన్' మూవీ కూడా హిట్ ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం అనూ బేబీ చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'నేల టికెట్' సినిమాలో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది ముంబై మోడల్ మాళవిక శర్మ. డెబ్యూ మూవీ డిజాస్టర్ గా మారడంతో అమ్మడి గురించి ఎక్కడా డిస్కషన్ జరగలేదు. మూడేళ్ల తర్వాత వచ్చిన 'రెడ్' సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించింది కానీ, అది హీరో రామ్ పోతినేని ఖాతాలోకి వెళ్లిపోయింది. అనంతరం తమిళ్ లో తీసిన 'కాఫీ విత్ కాదల్' కూడా డిజప్పాయింట్ చేసింది. దీంతో ఇప్పటికే ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఈ బ్యూటీ, సినిమాల నుంచి కాస్త విరామం తీసుకొని లాయర్ గా మారింది. ఇటీవల 'భీమా'తో తిరిగొచ్చిన ఈ ముద్దుగుమ్మకు నిరాశే ఎదురైంది. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మాళవిక ఇప్పుడు 'హరోం హర' మూవీలో సుధీర్ బాబుకు జోడిగా నటిస్తోంది. ఇది మే నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన 'ఏజెంట్' సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయింది సాక్షి వైద్య. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ డిజాస్టర్ గా మారింది. అయినప్పటికీ 'గాండీవధారి అర్జున' మూవీలో మెగా హీరో వరుణ్ తేజ్ కు జోడిగా నటించే ఛాన్స్ అందుకుంది. ఇది కూడా దారుణమైన పరాజయం చవిచూడటంతో సాక్షిపై ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర పడిపోయింది. ఆ తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' లో పవన్ కళ్యాణ్ సరసన నటించనుందని, సాయి ధరమ్ తేజ్ కు హీరోయిన్ గా తీసుకున్నారని వార్తలు వచ్చాయి కానీ.. అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.
తమిళ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన ప్రియా భవానీ శంకర్.. తెలుగు చిత్ర పరిశ్రమలో రాణించలేకపోయింది. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు తీసిన 'కల్యాణం కమనీయం' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే భారీ పరాజయాన్ని అందుకుంది. ఈ మధ్య గోపీచంద్ తో కలిసి చేసిన 'భీమా' మూవీ అమ్మడికి హిట్టివ్వలేదు. ఇప్పుడు లేటెస్టుగా విశాల్ తో నటించిన డబ్బింగ్ సినిమా 'రత్నం' కూడా మిశ్రమ స్పందన దక్కించుకుంది. అయితే ఓటీటీలో అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించిన 'దూత' వెబ్ సిరీస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రియా ప్రస్తుతం కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న 'ఇండియన్ 2' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఇలా పలువురు ముద్దుగుమ్మలకు తెలుగులో అవకాశాలు వస్తున్నా, అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఎంత టాలెంట్ ఉన్నా, వరుస పరాజయాలు చవిచూడటంతో ప్లాప్ హీరోయిన్లు అనే ముద్ర పడిపోయింది. మరి రానున్న రోజుల్లో అయినా సాలిడ్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: