'9 'భాషల్లో రీమేక్ అయి రికార్డు క్రియేట్ చేసిన ఏకైక తెలుగు సినిమా...!!

murali krishna
ఓ భాషలో హిట్టైన సినిమాని వేరే భాషలో రీమేక్ చేయడం చాలా కామన్. మలయాళంలో తీసిన 'దృశ్యం' సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీల్లో రీమేక్ అయ్యి, ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది. ఇంతకుముందు తెలుగులో వచ్చిన చాలా సినిమాలు, వేరే భాషల్లో రీమేక్ అయ్యాయి, సక్సెస్ అయ్యాయి. అయితే ఇండియాలో అత్యధిక భాషల్లో రీమేక్ అయిన సినిమా, టాలీవుడ్‌లో తెరకెక్కిన సినిమాయే అనే విషయం ఎంత మందికి తెలుసు?అవును, ఓ తెలుగు సినిమా, ఇప్పటికే 9 భాషల్లో రీమేక్ అయ్యి, ఇండియాలోనే అత్యధిక సార్లు రీమేక్ అయిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. సిద్ధార్థ్, త్రిష, శ్రీహరి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన 'నువ్వు వస్తానంటే నేను వద్దంటానా' సినిమా, 2005 సంక్రాంతికి విడుదలైన సెన్సేషనల్ విజయం సాధించింది.1989లో వచ్చిన 'మైనే ప్యార్ కియా' సినిమా కథ స్ఫూర్తితో వీరూ పోట్ల ఈ సినిమా కథను రాసుకున్నాడు. 'వర్షం' సినిమాలో త్రిష, వాన కోసం పాడే 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' పాట నుంచి ఈ టైటిల్‌ని తీసుకున్నారు.తన ప్రేమను గెలిపించుకోవడానికి వ్యవసాయం చేసే ఎన్‌ఆర్‌ఐ పాత్రలో సిద్ధార్థ్ ఒదిగిపోయాడు. ఇంతకుముందు ఈ పాయింట్‌తో నాగార్జున, సౌందర్య ప్రధాన పాత్రలుగా 'రాముడొచ్చాడు' సినిమా కూడా వచ్చింది..2005లో తెలుగులో విడుదలైన ఈ సినిమాని 2006లో 'జయం' రవి, 'ఉన్నక్కుం ఎన్నాక్కుం' పేరుతో రీమేక్ చేశాడు. అక్కడ కూడా త్రిషే హీరోయిన్. కన్నడలో అనిరుథ్, రక్షిత కలిసి 'నీనెల్లో నానల్లే' పేరుతో రీమేక్ చేశారు.
అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్టైంది..బెంగాలీలో దేవ్, పాయల్ సర్కార్ కలిసి 'ఐ లవ్ యూ' పేరుతో 2007లో రీమేక్ చేశారు. ఈ సినిమాని అరకు, హైదరాబాద్ ఏరియాల్లో చిత్రీకరించారు. మణిపూరీ భాషలో 2007లో 'నింగోల్ తజాబా' పేరుతో, ఓడియాలో 'సునా చడాయ్ మో రూపా చడాయ్' పేరుతో 2009లో, పంజాబీలో 'తేరా మేరా కి రిస్తా' పేరుతో 2009లో.. బంగ్లాదేశీ బెంగాలీలో 'నిస్సా అమర్ తుమీ' పేరుతో 2010లో, నేపాలీలో అదే ఏడాది 'ది ఫ్లాష్ బ్యాక్: ఫకేరా హెర్దా' పేరుతో రీమేక్ అయ్యింది.ఆఖరిగా 2013లో 'రామయ్యా వస్తావయ్యా' పేరుతో శ్రుతి హాసన్, గిరీశ్ కుమార్ కలిసి హిందీలో రీమేక్ చేశారు..హిందీ రీమేక్‌కి తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాని డైరెక్ట్ చేసిన ప్రభుదేవాయే డైరెక్టర్..అయితే బాలీవుడ్‌లో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే 9 భాషల్లో రీమేక్ అయిన సినిమాగా మాత్రం 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమా రికార్డు క్రియేట్ చేసింది.. తెలుగులో 9 ఫిల్మ్‌ ఫేర్ అవార్డులు, ఐదు నంది అవార్డులు గెలుచుకుంది 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' మూవీ.. మిగిలిన భాషల్లో బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించినా, తెలుగులో వచ్చినన్ని అవార్డులు మాత్రం రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: