ఆసక్తి రేకెత్తిస్తున్న 'చియాన్ 61' పోస్టర్..
విక్రమ్ కథానాయకుడిగా పా.రంజిత్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. మాళవిక మోహనన్ కథానాయిక. ఈ సినిమాకి 'తంగలాన్' అనే టైటిల్ ఖరారు చేశారు. దీన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వీడియో గ్లింప్స్ను పంచుకున్నారు. ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి.. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో తెరకెక్కుతునట్లు అర్థమవుతోంది. ఇందులో విక్రమ్ ఓ గిరిజన తెగకి చెందిన నాయకుడి పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.'మరో భారతం'కు శ్రీకారం.. శియా గౌతమ్ ప్రధాన పాత్రలో జగదీష్ దూగాన తెరకెక్కిస్తున్న నాయికా ప్రాధాన్య చిత్రం 'మరో మహాభారతం'. ఎస్.ఎస్. క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఆకాష్ పూరి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''టైటిల్ చాలా బాగుంది. మంచి కథతో రానున్న ఈ చిత్రం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'' అన్నారు. ''ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. కథకు తగ్గట్లుగా ఉంటుందని శియాను తీసుకున్నాం. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం'' అన్నారు చిత్ర దర్శకుడు.
కాశీలో మొదలైన ప్రేమకథ.. జైద్ ఖాన్ కథానాయకుడిగా జయతీర్థ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం 'బనారస్'. తిలకరాజ్ బల్లాల్ నిర్మాత. సోనాల్ మాంటెరో కథానాయిక. ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో నిర్మాత సతీష్ వర్మ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని ''తొలి తొలి వలపే'' గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకు అజనీష్ లోక్నాథ్ స్వరాలు సమకూర్చగా.. కృష్ణకాంత్, భాస్కరభట్ల సాహిత్యమందించారు. కార్తీక్, కె.ఎస్.చిత్ర ఆలపించారు. ''బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రమిది. సైన్స్ ఫిక్షన్ అంశాలతో మిళితమై ఉంటుంది. జైద్, సోనాల్ జోడీ చూడముచ్చటగా ఉంటుంది'' అని చిత్రవర్గాలు తెలిపాయి. కూర్పు: కె.ఎం.ప్రకాష్, ఛాయాగ్రహణం: అద్వైత గురుమూర్తి.