45 నిమిషాల్లోనే 8 పాటలకు స్వరాలు అందించిన ఇళయ రాజా..!!
యావత్ భారత దేశం గర్వించదగ్గ సంగీత దర్శకులలో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ముందుంటారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని ఇళయ రాజా. చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా ఇళయరాజా సంగీతజీవితాన్ని ప్రారంభించాడు. అదే సమయంలో అప్పుడప్పుడు మద్రాసులో సంగీతం రికార్డు జరుపుకొనే పశ్చిమ బెంగాల్కు చెందిన సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా,కీ బోర్డు కళాకారుడిగా పనిచేశాడు.
ఆ తరువాత కన్నడ సంగీత దర్శకుడైన జి.కె.వెంకటేష్ దగ్గర సహాయకుడిగా చేరడంతో చలన చిత్ర సంగీత పరిశ్రమతో అనుబంధం ప్రారంభమైంది. ఈ సంగీత దర్శకుని దగ్గరే దాదాపు 200 సినిమాలకు సహాయకుడిగా పనిచేశాడు. ఇక 1976లో తమిళ సినిమా అణ్ణక్కిళితో చలన చిత్ర సంగీత దర్శకులుగా పరిచయం అయ్యారు ఇళయరాజా. అప్పటినుంచి ఇళయరాజా ఏ పాటకు ట్యూన్ కట్టినా, ఏ పాటను ఆలపించినా మరో ప్రపంచంలోకి వెళ్లవలసిందే. అందుకే సంగీతం, ఇళయరాజా.. రెండింటి గురించి విడిగా చెప్పలేం. అందుకే సంగీతం అంటే ఇళయరాజా, ఇళయరాజా అని అంటుంటారు. ఇక ఇళయరాజా అతి తక్కువ సమయంలో పాటలు అందించగలరనే విషయం తెలిసిందే.
కానీ, 45 నిమిషాల్లో 8 పాటలకు స్వరాలు సమకూర్చారంటే నమ్మగలరా? అవును! దర్శకుడు ఆర్.కె.సెల్వమణి తెరకెక్కించిన తమిళ చిత్రం ‘చెంబరుతి’ కి ఇళయరాజా సంగీతం అందించారు. ఇందులోని 8 పాటలు కేవలం 45నిమిషాల్లో కంపోజ్ చేశారట. ఇళయరాజా సంగీత సారథ్యంలో ఇదొక అరుదైన రికార్డుగా చెప్పుకోవాలి. అలాంటి ఘనత సాధించిన ఇళయరాజా నేడు 77వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఇక ఆయన కెరీర్లో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లో వెయ్యికి పైగా సినిమాలలో దాదాపు 5000కు పైగా పాటలకు బాణీలందించారు. ఈ క్రమంఓలనే ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు.