టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ మూవీ జెర్సీ ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ రీమేక్ లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కాగా ప్రాక్టీస్ లో భాగంగా షాహిద్ కపూర్ తీవ్రంగా గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి , అతని కింది పెదవికి బలంగా తాకింది. దాంతో షాహిద్ కు 13కుట్లు వేశారు.
ఇక ఇప్పుడు గాయం పూర్తి గా తగ్గడం తో షాహిద్ మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. కాగా జెర్సీ లో జూనియర్ నాని గా నటించి మెప్పించిన రోనిత్ కర్మనే ఈ రీమేక్ లో కూడా ఆ పాత్రలో అతనే నటిస్తుండడం విశేషం. క్రికెట్ నేపథ్యం లో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో కోచ్ పాత్రలో షాహిద్ తండ్రి పంకజ్ కపూర్ కనిపించనున్నాడు. అమన్ గిల్ తో కలిసి ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 28 , 2020లో ప్రేక్షకులముందుకు రానుంది.
ఇక షాహిద్ కపూర్ గత ఏడాది కబీర్ సింగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ కొట్టాడు. బ్లాక్ బాస్టర్ తెలుగు మూవీ అర్జున్ రెడ్డి కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం సుమారు 270కోట్ల వసూళ్లను రాబట్టి 2019హిందీ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రం తరువాత జెర్సీ రూపంలో మరో రీమేక్ తో రానున్న షాహిద్ కపూర్ మళ్ళీ అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడో చూడాలి.